యనమలా?...ఎందుకిలా?...ఎవరూ అడగకుండానే వివరణలు...
అమరావతి:టిడిపిలో బైటకు కనిపించని అంతర్మథనం ఏదో జరుగుతున్నట్లుంది...అందుకే ఆ పార్టీ నుంచి ఇటీవల భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. వివరణ ఇవ్వాల్సిన వాటికి ఇవ్వకపోవడం...ఎవరూ అడగని వాటికి ప్రత్యేకించి వివరణలు ఇవ్వడం ఈ మధ్యే తటస్థిస్తోంది.
అది కూడా ఎవరో చిన్నా చితకా నేత కూడా కాదు తెలుగుదేశం పార్టీ లో అత్యంత సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు కూడా ఇటీవల ఇలా అనవసర వివరణలు ఇస్తూ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని బట్టే టిడిపి కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించిన నిర్ణయాలపై తీవ్ర ఒత్తిడికి లోనవుతుందేమోననే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి.
కర్ణాటక టూరుతో...కలకలం
ఇటీవలికాలంలో ఎపి రాజకీయాలపై కర్ణాటక పరిస్థితులు అత్యంత ప్రభావం చూపాయి. ఎన్నికల దగ్గర నుంచి ఫలితాల వరకు...బిజెపికి సిఎం పదవి నుంచి మళ్లీ కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కర్ణాటక ప్రభావం అంతాయింతా కాదు. ఇదంతా ఒకెత్తయితే కుమారస్వామి ప్రమాణ స్వీకారంకు చంద్రబాబు వెళ్లాలా వద్దా అనే మరో సంశయం నేపథ్యంలో తుది నిర్ణయం చంద్రబాబుదే అయినా ఆ నిర్ణయం ఆయన మనో భీష్టం ప్రకారం కాకుండా పార్టీ శ్రేణుల సూచన మేరకే అన్నట్లుగా ఎవరూ ఊహించని ఒక వివరణ చంద్రబాబు కర్ణాటక టూరు ముందు వచ్చింది. ఆ ప్రకారమే చంద్రబాబు కర్ణాటక టూరుకు కదిలివెళ్లినట్లుగా కనిపించింది.
చంద్రబాబు వ్యవహారం...పరిశీలన
కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు కర్ణాటక పర్యటనపై ఎపిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు అక్కడ ఎలా స్పందిస్తారనే విషయం ఒక అంచనాకు వచ్చేందుకు రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ చైతన్యమున్న జనాలు కూడా చాలా ఆసక్తిగా పరిశీలించారు. బిజెపిని ఇటీవలి కాలంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అందుకు తగినట్లు గానే అక్కడ అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడమే కాదు ఒక పెద్దన్నలా వ్యవహరించిన తీరు కూడా అందరూ చూశారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలతో చేయీ చేయీ కలిపిన దృశ్యం కూడా వీరి దృష్టి కోణం నుంచి దాటిపోలేదు. అయితే ఈ పరిణామంపై టిడిపి అనుకుంటున్నట్లుగా జనాలెవరూ ఊహించని అనూహ్య పరిణామం ఏమీ కాదు. కాకపోతే తామనుకునే విషయానికి సంబంధించి మరికొంత స్పష్టత లభించినట్లుగా ఫీలయ్యారు...అంతే..
టిడిపి...ఊహించలేదా?
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి వచ్చేశారు. రావడంతోనే బిజెపి, వైసిపి నేతలు పిల్ల కాంగ్రెస్ అంటూ టిడిపిపై, చంద్రబాబుపై విమర్శలతో దండెత్తారు. అయితే ఈ విమర్శలు అనూహ్యం ఏమీ కాదు. టిడిపి అధినేత కాంగ్రెస్ అగ్ర నేతలతో కలసి ఒకే వేదికపై కనిపిస్తేనే అటువంటి విమర్శలు వస్తాయని ఎవరైనా ఊహించగలరు. అలాంటప్పుడు టిడిపి ఈ విమర్శలను ముందుగా ఊహించలేదా?...కానీ హఠాత్తుగా ఈ విషయంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇచ్చిన వివరణ చూస్తే టిడిపి ఈ విమర్శలను ఊహించకపోవడమో,తట్టుకోలేకపోతుందనో...లేక పార్టీకి నష్టం జరుగుతుందనో భావిస్తున్నట్లుగా యనమల ఇచ్చిన వివరణను బట్టి అర్థం అవుతోంది.
మరెందుకు...యనమల వివరణలు
గతంలో కూడా ఒకానొక సందర్భంలో ఎవరూ అడగకుండానే బిజెపి నేతలతో సుజనా చౌదరి భేటి గురించి బైటపెట్టి వివరణ అడిగి ఆశ్చర్యపరిచిన యనమల తాజాగా చంద్రబాబు కర్ణాటక టూరు గురించి ఎవరూ వివరణ అడగకుండానే వివరణ ఇచ్చి మరోసారి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ యనమల ఏమన్నారంటే...చంద్రబాబును కర్ణాటకకు కాంగ్రెస్ నేతలు పిలిస్తే వెళ్లలేదని కేవలం జెడిఎస్ ఆహ్వానం మేరకే చంద్రబాబు బెంగళూరు వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ పిలిస్తే వెళ్లారన్న ప్రచారం సరికాదని అన్నారు. అంతేకాదు చంద్రబాబు కర్ణాటకలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారని...కానీ ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఒకే వేదికపై సోనియా, రాహుల్ గాంధీ ఎదురైనప్పుడు చంద్రబాబు పలుకరించడం, పరస్పరం అభినందించుకోవడం సాంప్రదాయమని యనమల చెప్పుకొచ్చారు.
వివరణలపై ఆశ్చర్యం
అయితే కర్ణాటక టూరుపై యనమల వివరణ రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అందరూ ఊహించినట్లే జరిగిందనే భావన ప్రజల్లో కనిపించినట్లుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ తరహా ప్రచారం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే విశ్లేషణ టిడిపిలో అంతర్గతంగా జరిగి ఉండొచ్చని...అందుకే యనమల హఠాత్తుగా ఈ విషయమై ఇలా వివరణ ఇచ్చి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనివల్ల టిడిపికి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఒకవైపు కేంద్రంలో బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీని దెబ్బతీయాలంటే దానికి బద్ద శత్రువైన కాంగ్రెస్ తో సంప్రదింపులు తప్పనిసరి అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఒకవైపు ఆ పార్టీతో చేయి కలిపే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు అదేమీ లేదని వివరణ ఇవ్వడం వల్ల టిడిపి,చంద్రబాబు విశ్వసనీయతపై సందేహాలు రేపినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యనమల తాజా వివరణ ఖచ్చితంగా మరో సెల్ఫ్ గోలేనని వారు అభివర్ణిస్తున్నారు.