కలాం డిక్లరేషన్ ఇచ్చారు కదా.. మరీ మీరెందుకు ఇవ్వరు, జగన్పై దేవినేని ఉమ విసుర్లు
ఏపీలో డిక్లరేషన్ రగడ కొనసాగుతోంది. వాస్తవానికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఇతర మతాలకు చెందినవారు వస్తే.. డిక్లరేషన్ ఇచ్చేవారు. కానీ దానిని ఇటీవల తిరుమల తిరుపతి పాలకమండలి సవరించింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ మార్పులు చేసింది. ఆ తర్వాత బుధవారం సీఎం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే జగన్.. డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి.
సీఎం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనాదిగా వస్తున్న ఆచారాలను కాలరాసే హక్కును మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ను నింపడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. సీఎం పదవీలో ఉండి మీరే ఆచారాన్ని ధిక్కరించి దరఖాస్తు నింపనంటే ఎలా అని మండిపడ్డారు. దీనిని ఆదర్శంగా తీసుకొని.. మిగతావారు డిక్లరేషన్ ఇస్తారా అని అడిగారు.
డిక్లరేషన్పై సంతకం చేసి సతీసమేతంగా ముఖ్యమంత్రి జగన్ వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భక్తులు కోరుకున్నారని దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు. కానీ అక్కడ జరిగింది మాత్రం విరుద్ధం అని అభిప్రాయపడ్డారు. తర్వాత మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, జగన్ ప్రవర్తించిన తీరుతో భక్తుల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని చెప్పారు.
గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని ఉమా గుర్తుచేశారు. తనకు శ్రీవారిపై ఉన్న భక్తిభావాన్ని చాటుకున్నారని ఉమ గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం అలా చేయలేదని మండిపడ్డారు. మాజీ రాష్ట్రపతి నియమ, నిబంధనలను పాటిస్తే.. సీఎం పాటించకపోవడం విడ్డూరంగా ఉంన్నారు.