'ఆ ఒక్క అబద్దం చెప్పి ఉంటే జగన్ సీఎం అయ్యుండేవారు, నిజాయితీ వల్లే'
కడప: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ ఒక్క అబద్దం చెప్పి ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారని వైసిపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం కడప జిల్లాలో మాట్లాడారు.
రెండేళ్ల క్రితం ఒక్క అబద్ధం చెప్పుంటే జగన్ సీఎం అయ్యుండేవారన్నారు. నిజాయతీగా ఉండటమే ఆయన్ను అధికారానికి దూరం చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని పచ్చి అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక దానిని మరిచారన్నారు.
చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ అన్నందుకే, తమ పార్టీకి దూరమైన కేవలం 5 లక్షల ఓట్లు వైసిపిని అధికారానికి దూరం చేశాయన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైసిపి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు, పార్టీ అధికార గుర్తయిన టేబుల్ ఫ్యాన్ వచ్చిందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ఏదైనా అంటే చేసి తీరుతారని, వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో వైసిపి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలన్నారు.
ఎన్నికలకు ముందు రైతు రుణ మాఫీ, రాజధాని ప్రాంత రైతులకు రుణాలన్నీ మాఫీ అన్న చంద్రబాబు, ఇప్పుడు మాట మార్చి వారిని మోసం చేశారన్నారు. జగన్ రైతు రుణమాఫీ పైన ఒక్క అబద్దం చెప్పి ఉంటే 175 సీట్లు వైసీపికి వచ్చి ఉండేవన్నారు.