నోట్ల రద్దుపై టిడిపి రివర్స్: 'జగన్ శని వదిలించుకుంటారు, బాబుకు సంబంధం లేదు'
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం విడ్డూరమని మంత్రులు అన్నా
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం విడ్డూరమని మంత్రులు రావెల కిషోర్ బాబు, కామినేని శ్రీనివాస రావు, దేవినేని ఉమామహేశ్వర రావులు అన్నారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని వారు చెప్పారు. అందుకు చంద్రబాబును తప్పుబడుతూ విమర్శలు చేయడం సరికాదని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు పైన కేంద్రం ఎన్నో రోజుల కింద నిర్ణయం తీసుకుంటే ప్రజల ఇబ్బందుల గురించి జగన్కు పదిహేను రోజుల తర్వాత తెలిసిందా అన్నారు.
జగన్ అకస్మాత్తుగా నిద్రలేచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్తులో ప్రజలకు మంచి జరుగుతుందని, కానీ తాను దోచుకున్న లక్షల కోట్లు ఏమవుతాయోనన్న భయంతో జగన్ మాట్లాడుతున్నారన్నారు.
జగన్ రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఈ శనిని వదిలించుకుంటారని చెప్పారు. నేలమాళిగల్లో దాచుకున్న డబ్బును మార్చుకునేందుకే నగదు మార్పిడి గడువును పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని ఆరోపించారు.
నోట్లు రద్దు చేసిన 12 రోజుల తర్వాత బయటకు వచ్చి పొడిగించాలని ఏ ముఖం పెట్టుకుని లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల మార్పిడిపై మాట్లాడే స్థాయి తనది కాదని, వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారథి మాట్లాడాతారని అనడం చూస్తుంటే, ప్రజా సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందో తెలుస్తోందన్నారు.
నగదు రహిత లావాదేవీల కోసం రూపే కార్డులు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే, సెలూన్లలో రూపే కార్డు చూపిస్తే గడ్డం చేస్తారా అని జగన్ హేళన చేయడం ఏమిటన్నారు. జగన్ అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పగించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
మరో మంత్రి కామినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు టీడీపీ ముసుగు వేసుకున్నారని చేసిన వ్యాఖ్యలను జగన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని వేరుగా డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి వెంకయ్య ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
కాగా, నోట్ల రద్దు పైన టిడిపిది ఓ విధంగా రివర్స్ గేర్ అంటున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని మొదటి నుంచి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు, టిడిపి నేతలు కూడా పలుమార్లు చెప్పారని, ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అది తమ నెత్తిన పడకుండా ఉండేందుకు చంద్రబాబుకు ఏం సంబంధమని అడుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.