తెలంగాణపై మాట్లాడవేం: జగన్కు గాలి, 'ఏపీకి సొమ్ము వాపస్'
హైదరాబాద్: తెలంగాణలో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం ప్రశ్నించారు.
జగన్ ఓటుకు నోటు పైన మాట్లాడుతారని, కానీ ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడరని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యల పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, జగన్లు వెళ్లి పరామర్శించడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యల మాటేమిటన్నారు. అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్య గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
హోదా ఇవ్వమని చెప్పలేదు: పరకాల ప్రభాకర్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదని పరకాల ప్రభాకర్ సోమవారం నాడు అన్నారు. ఆయన అన్నట్లుగానే మంగళవారం లోకసభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. అన్ని హామీలు నెరవేరుస్తామని, హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
పరకాల సోమవారం మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పారు. ఏపీకి హోదా పైన విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చే వరకు తమ చేయి పట్టుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.
మిత్రపక్షం కాబట్టి నచ్చచెబుతామని, తమ కష్టం, ఇబ్బందులు, శ్రమను వివరిస్తామన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని పదేపదే కోరడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా చెప్పారన్నారు.
ఏపీకి సొమ్ము వాపసు: ఉమా భారతి
పోలవరం పనుల పైన ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును పోలవరం ప్రాజెక్టు ప్రాధికారిక సంస్థ వాపసు చేస్తోందని కేంద్రమంత్రి ఉమా భారతి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సోమవారం సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు పనులన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణళో జరుగుతున్నాయన్నారు.