అదే జగన్కు ప్లస్, పవన్కు ఎంతమంది భార్యలుంటే ఆయనకేం సంబంధం: జేసీ
అనంతపురం/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్కు రాజకీయంగా ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటో చెప్పారు. ఆయన మంగళవారం అమరాతిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఓ ఛానల్తో మాట్లాడారు.
చదవండి: వైసీపీనుంచి పోటీ చేసిన కోట్ల బీజేపీలో చేరారు: టీడీపీపై పురంధేశ్వరి నిప్పులు
జగన్కు అదే ప్లస్
జగన్కు ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు పైన జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అవి అభ్యంతరకరమైనవన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్, దానిని వ్యతిరేకించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్లే శ్రీశైలంలోకి నీరు వస్తోందని, ఈ సంగతి మరిచిపోయారా అన్నారు.
పవన్కు ఎంతమంది భార్యలు అయితే జగన్కు ఏం సంబంధం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యక్తిగత విమర్శలు సరికాదని జేసీ అన్నారు. పవన్ పెళ్లిళ్ల పైన వైసీపీ అధినేత వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. పవన్కు ఎంతమంది భార్యలు అయితే జగన్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత తన స్థాయికి తగినట్లు మాట్లాడాలన్నారు.
మేం చెయ్యను పో అనడం సరికాదు
కాపు రిజర్వేషన్ వ్యవహారంలోను జగన్ తీరు సరిగా లేదని జేసీ అభిప్రాయపడ్డారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే దానిపై అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పాలి కానీ, మేం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని, చెయ్యను పో అనడం సరికాదన్నారు.
తెలంగాణలో ముందస్తు, టీడీపీ-కాంగ్రెస్ పొత్తు
అంతకుముందు, ఆయన కాంగ్రెస్ - టీడీపీ పొత్తు, తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, అక్కడ టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చునని, ఏపీలో మాత్రం సరికాదని చెప్పారు. పొత్తులపై పరిస్థితులు ఎప్పటికి అప్పుడు మారుతుంటాయని అభిప్రాయపడ్డారు. బీజేపీని నమ్మి మోసపోయామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసమే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని, కలిసి ఎన్నికలు జరిగితే ముస్లీంలు దూరమవుతారని భావించి అసెంబ్లీకి ముందే వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు.