చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు కష్టమేనా ? కేంద్రంపై వైసీపీ ఒత్తిడి ఫలించడం లేదా ?
గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా విభజన హామీల్లో భాగమైన ప్రత్యేక హోదా కోరుతూ విపక్ష వైసీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోడీ అయితే రాష్ట్రంలో నిరసనలేంటని అధికార టీడీపీ సెటైర్లు వేసేది. ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు నిరసనలకు దిగడం ప్రారంభించారు. ఎన్డీయేకు గుడ్బై చెప్పేశాక టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోరుతూ పార్లమెంటు బయట నిరసనలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఏపీలో అధికారంలోకి ఉన్నప్పటికీ, కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నప్పటికీ వైసీపీ ఎంపీలు పార్లమెంటు బయట చేస్తున్న నిరసనలు చర్చనీయాంశమవుతున్నాయి.
హోదా కోసం పోరాడారా..? సీబీఐ ఎంక్వైరీ కోసం నిరసనలా, వైసీపీ ఎంపీలపై కేశినేని నాని ఫైర్..
వైసీపీ ఎంపీల నిరసనలు..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నిరసనలకు దిగుతున్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, వాటిలో చోటు చేసుకున్న కుంభకోణాలపై ఇప్పటికే కేబినెట్లో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన వైసీపీ సర్కారు.. ఇప్పుడు తమ ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి చేయించి విచారణ ప్రారంభించేలా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా వాటిలో పాల్గొనకుండా బయటికి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. టీడీపీ హయాంలో స్కాంలపై సీబీఐ దర్యాప్తు కావాలంటూ ప్లకార్డులతో నిరసనలు చేపడుతున్నారు. ఇందులో వైసీపీకి చెందిన 26 మంది ఎంపీలు పాల్గొంటున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ మృతి, రెబెల్ ఎంపీ రఘురామరాజు గైర్హాజరుతో మిగతా ఎంపీలు నిరసనల్లో పాల్గొంటున్నారు.
సమస్యలపై చర్చించకుండా నిరసనలా..?
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. కరోనాతో పాటు రాష్ట్రాలకు ఆర్ధిక సాయం అందించే అంశంపైనా కేంద్రం ఉభయసభల్లో పలు చర్చలు నిర్వహిస్తోంది. వీటిలో రాష్టంతో సంబంధం ఉన్న పలు అంశాలున్నాయి. జీఎస్టీ సాయం అందించే విషయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు కూడా వైసీపీకి వీలుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంది. అయినా వీటన్నింటినీ కాదని టీడీపీ హయాంలో జరిగిన స్కాంలపై దర్యాప్తు కోసం ఒత్తిడి పేరుతో పార్లమెంటు సమావేశాలను వదిలిపెట్టి వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరసనలు విమర్శలకు తావిస్తున్నాయి. మరోవైపు విపక్ష టీడీపీకి ఇరుసభల్లో కలిపి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో వారు బలంగా వాణిని వినిపించే అవకాశం దక్కడం లేదు. అయినా సమయం దొరికినపుడల్లా టీడీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తుతున్నారు. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం సమస్యలను వదిలి సీబీఐ దర్యాప్తే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
లాబీయింగ్ అవకాశాన్ని వదిలిపెట్టి...
ప్రస్తుతం వైసీపీ కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతోంది. ఆ పార్టీ అడిగినా అడకపోయినా కీలక బిల్లులపైనా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలతోనూ మద్దతిచ్చింది. ఎన్డీయే మిత్రపక్షాలే వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులపైనా కేంద్రానికి మద్దతు పలికింది. కేంద్రంతో లాబీయింగ్ చేసేందుకు వైసీపీ ఎంపీలకు పూర్తిగా అవకాశం ఉంది. అయినా కాదని సీబీఐ దర్యాప్తు కోసమంటూ నిరసనలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సీఎం జగన్ కానీ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు కానీ ప్రధాని అపాయింట్మెంట్ కానీ హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ కానీ తీసుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరే అవకాశం కూడా ఉంది. కానీ అలా చేయకుండా విపక్ష పార్టీల తరహాలో ఎంపీలు నిరసనలకు దిగడం చర్చనీయాంశమవుతోంది.
Recommended Video
నిరసనల వెనుక కారణమిదేనా ?
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరావతి భూముల స్కాం, ఫైబర్ గ్రిడ్ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు అంత సులువుగా కనిపించడం లేదు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ కేంద్రంతో సీబీఐ దర్యాప్తు చేయించాలని భావిస్తుంటే అటు కేంద్రం కూడా ఆ బురద తామెందుకు అంటించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో సీబీఐ దర్యాప్తు విషయంలో కేంద్రం దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు లేదని సమాచారం. ఈ మేరకు వైసీపీకి సంకేతాలు అందడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా నిరసనలకు స్పందించి కేంద్రం ముందడుగు వేస్తుందా అంటే అదీ గ్యారంటీ లేదు.