ఇష్టంలేని పెళ్లి: 20 రోజులకే, బైక్పై వెళ్తూ భర్త మెడను కత్తితో కోసిన భార్య
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బైక్ పైన వెళ్తుండగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటన జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలోని ఎం.నర్సాపురంలో సోమవారం జరిగింది. జిల్లాకు చెందిన బుడ్డా నవీన్, నీలిమకు ఈ నెల 9వ తేదీన పెళ్లయింది.
నవీన్ తన అత్తగారింటి నుంచి భార్య నీలిమతో కలిసి బైక్ పైన తన ఇంటికి వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో కోటబొమ్మాళి రైల్వే నిలయం దగ్గరకు రాగానే బైక్ వెనక కూర్చున్న నీలిమ భర్తను హతమార్చేందుకు మెడపై కత్తితో దాడి చేసి పారిపోయింది.
స్థానికులు, ప్రయాణీకులు చూసి నవీన్ను ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో ఉన్న అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. మొదట కోటబొమ్మాళి ఆసుపత్రికి, ఆ తర్వాత శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.
నీలిమకు ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లే దాడి చేసిందని అంటున్నారు. పెళ్లైన ఇరవై రోజులకే భార్య దాడి చేసింది. ప్రస్తుతం నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. సంతబొమ్మాళి ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.