భర్తతో అక్రమ సంబంధం ఉందని...నడిరోడ్డుపై యువతిని చితకబాదిన భార్య
విజయవాడ: తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకుందంటూ నడిరోడ్డుపై ఒక యువతిని మహిళ చితకబాదిన ఘటన కలకలం సృష్టించింది. ఉన్నట్టుండి యువతిపై ఓ మహిళ దాడిచేసి కొడుతుండటంతో స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు.
అనంతరం దాడికి పాల్పడుతున్న మహిళను నిలువరించి విషయం అడుగగా, ఈ యువతి తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పింది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో కొడుతున్నానని, తన భర్త కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పడంతో స్థానికులు వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో ఈ యువతితో సంబంధం పెట్టుకున్న తన భర్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తికి తొమ్మిది సంవత్సరాల క్రితం రమాదేవి అనే యువతితో పెళ్లైయ్యింది. వీళ్లకో కుమారుడు కూడా ఉన్నాడు. సురేష్ ప్రస్తుతం విజయవాడలోని సన్రైజ్ ఆస్పత్రిలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ కుమార్ ఒక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, ఇప్పుడైతే ఏకంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని భార్య రమాదేవి ఆరోపిస్తోంది.
ఇదే విషయమై తాను గతంలో చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు మందలించి వదిలేయడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతోంది. దీంతో వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు తానే స్వయంగా ప్రయత్నం చేస్తున్నానని...ఈ క్రమంలో గురువారం రాత్రి సురేష్ కుమార్ మరో యువతితో కనిపించడంతో ఆ యువతిపై రమాదేవి దాడి చేసింది.
తన భర్త, మరో యువతి సహజీవనం చేస్తున్నారని తనకు చాలా రోజుల క్రితమే తెలుసని రమాదేవి చెబుతోంది. ఆధారాల కోసం ఎదురు చూసి అందరి ముందు వాళ్లను పట్టుకున్నానంది. సదరు యువతి ఉంటున్న ఇంటికి అద్దె కూడా తనభర్తే చెల్లిస్తున్నాడని చెప్పింది. ఇప్పుడిలా రెడ్ హ్యాండెడ్ గా దొరికారని ఆ యువతి ముఖాన్ని మీడియాకు చూపేందుకే కొట్టినట్లు తెలిపింది. అయితే స్థానికులు వారించడంతో వారి సూచన మేరకు రమాదేవి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అన్యాయం చేస్తున్న వీరిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతోంది.
అయితే రమాదేవి భర్త సురేష్ మాత్రం తన భార్యదే తప్పంటున్నాడు. ఆమె తనపై పలుమార్లు హత్యాయత్నాలు చేసిందని...ఇప్పుడు కూడా తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని అంటున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.... అతన్ని విచారించేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్కు ఉన్నతాధికారులతో ఫోన్ చేయించినట్లు తెలుస్తోంది.