కలకలం:మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం...కానిస్టేబుల్ అయిన భర్త వేధింపులే కారణం
విజయవాడ:చట్టాన్ని కాపాడాల్సిన ఒక రక్షక భటుడే తన భార్య పాలిట యమ భటుడిలా మారాడు...హోం గార్డ్ అయిన తన భార్యను నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేని ఆమె చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడాలని ప్రయత్నించింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కాగా ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త తరుపువారు సైలెంట్ గా అస్పత్రికి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అయితే కాలిన గాయాలతో ఈ మహిళా హోంగార్డు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే...
విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేస్తున్న మురళి, లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి ఆ తరువాత మానేసింది. అనుమానంతో భర్త మురళీ నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో విసిగిపోయిన లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంది.
దీంతో 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న మృత్యువుతో పోరాడుతోంది. అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా బైటకు తెలియనివ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.