రెండో పెళ్లికి సిద్ధపడిన భర్తపై శివమెత్తిన మహిళ
ఏలూరు: రెండో పెళ్ళికి సిద్ధపడిన భర్తను భార్య కాలర్ పట్టుకుని నిలదీసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో పుణ్యక్షేత్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల రంగప్రవేశంతో జీలకర్ర బెల్లం సీనుతో ఆ పెళ్లి నిలిచిపోయింది.
రాజమండ్రికి చెందిన లంక సురేంద్రమోహన్ శుక్రవారం ఉదయం శ్రీవారి తూర్పు రాజగోపుర ప్రాంతంలో విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ఒక యువతిని వివాహం చేసుకుంటున్నాడు. జీలకర్ర, బెల్లం ఘట్టం పూర్తయిన తరువాత తాళి కట్టడానికి కొన్ని క్షణాల ముందు ఒక యువతి పోలీసులతో కలిసి అక్కడకు చేరుకుంది.
తాను సురేంద్రమోహన్ భార్యనని, ఈ పెళ్లి నిలిపేయాలని చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. విశాఖ జిల్లాకు చెందిన తనకు సురేంద్ర మోహన్తో పదేళ్ల క్రితం వివాహమైందని, ఒక ఆడపిల్ల కూడ ఉందని ఆ మహిళ అన్నది. సురేంద్ర విశాఖపట్నంలో ఒక పాఠశాలలో టీచర్గా పనిచేశాడని, అ తరువాత ఉద్యోగం మాని ఇంటి వద్దనే ఉంటున్నాడని చెప్పింది. తనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఏడేళ్ల క్రితం ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డామని తెలిపింది.
అయితే తాను ఎవరితో మాట్లాడినా అనుమానించి హింసించేవాడని, అశ్లీల వీడియోలు చూస్తూ వేధించేవాడని విమర్శించింది. మరో యువతికి ఈ దుస్థితి రాకూడదని తెలిపింది. ఈ గందరగోళం నడుమ పెళ్లి పీటలపై ఉన్న సురేంద్ర అక్కడ నుండి జారుకుంటుండగా ఆమె వెంట పడి అతని కాలర్ పట్టుకుని నిలదీసే ప్రయత్నం చేసింది. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
తన భార్య ప్రవర్తన మంచిది కాదని సురేంద్ర ఆరోపించాడు. దీంతో వివాహం చేసుకుంటున్నానని చెప్పాడు. అక్కడ నుండి వెళ్లిపోతుండగా పోలీసులు అతడిని నిలువరించారు. భీమడోలు సిఐ ఎం వెంకటేశ్వరరావుకు విషయాన్ని ఫోనులో వివరించారు. ఆయన ఆదేశాల మేరకు వారి నుండి వివరాలు సేకరించి వదిలేశారు.