తమిళనాడు సీఎం పీఏనంటూ...మెడిసిన్ సీటు పేరుతో 15లక్షలు స్వాహా...భార్యాభర్తల అరెస్టు
కర్నూలు జిల్లా: తరుచూ గుడికి వచ్చేవారు...హైఫై మెయింటెన్స్ తో హడావుడి చేసేవారు...భర్తేమో తాను తమిళనాడు ముఖ్యమంత్రి పీఏనని చెప్పాడు...భార్యేమో వంత పలికింది...కట్ చేస్తే...మీ కొడుక్కి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని ఒక వ్యక్తిని నమ్మించి రూ. 15 లక్షలు కొట్టేశారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఛీటింగ్ కపుల్ ని అరెస్ట్ చేశారు...కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది.
విలేఖరుల సమావేశంలో ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ వెల్లడించిన వివరాల మేరకు...తమిళనాడు సేలంకు చెందిన రమణరావు అలియాస్ వెంకటరమణ, నిర్మల అలియాస్ నిర్మల కన్నన్ భార్యభర్తలు. వీరు ప్రస్తుతం నెల్లూరులోని కొండయ్యపాలెం వనంపోతు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు తరుచుగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మఠానికి వస్తుంటారు. ఈ క్రమంలో వెంకటరమణ మఠంలో ఓ ఉద్యోగితో మాటలు కలిపి తాను తమిళనాడు సీఎం పీఏనని...ఎవరికైనా ఏమైనా పనులు కావాల్సివస్తే తాను చేసి పెడతానని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో మంత్రాలయానికి చెందిన టి. అరవింద్ అనే వ్యక్తి తన కొడుకు పవన్కుమార్ ఇంటర్ పూర్తి చేశాడని, అతనికి ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నిస్తున్నామని మఠం ఉద్యోగికి చెప్పాడు. దీంతో మఠం ఉద్యోగి తమిళనాడు సీఎం పీఏ తనకు బాగా పరిచయమని, అతని ద్వారా సీటు ఇప్పిస్తానని ఆ మఠం ఉద్యోగి రమణారావు ఫోన్ చేసి ఈ పని చేసిపెట్టాలని కోరాడు. అతను అలాగేనంటూ ఎన్ఆర్ఐ కోటాలో సీటు ఇప్పిస్తానని, రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని రమణారావు చెప్పాడు. అలా అరవింద్ మొదటి విడతగా 2016 జూన్ 3వ తేదీ చెన్నైకి వెళ్లి ఓ లాడ్జ్జిలో రమణారావుకు రూ.10 లక్షలు ఇచ్చాడు. తర్వాత 2016 ఆగస్టు 16వ తేదీ రమణారావు అకౌంట్లోకి మరో రూ.5 లక్షలు జమ చేశాడు. కొద్ది నెలల తరువాత రమణారావు ఫోన్ పనిచేయలేదు.
దీంతో అరవింద్కు అనుమానం వచ్చి చెన్నైకి వెళ్లి ఆరా తీసినా అతడికి సంబంధించిన సమాచారం దొరకలేదు. 2017 నవంబరులో అరవింద్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో రమణరావు, నిర్మలపై చీటింగ్ కేసు నమోదు చేసి సీఐ రాము, ఎస్ఐ శ్రీనివాసనాయక్ దర్యాప్తు చేపట్టారు. రమణారావు చెన్నైలోని తన స్నేహితుడి ఇంట్లో, అతడి భార్య నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకుని మంత్రాలయానికి తీసుకువచ్చారు. వీరిని ఎమ్మిగనూరు కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ అంకినీడు ప్రసాద్ తెలిపారు.