విషాదం: రెండేళ్ళ తర్వాత కలుసుకొన్న భార్యభర్తలు ఆత్మహత్య, ఎందుకంటే?
వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది. ఆ భార్య, భర్తల మధ్య వివాహేతర సంబంధం ఎడబాటుకు గురిచేసింది.
చిత్తూరు: వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది. ఆ భార్య, భర్తల మధ్య వివాహేతర సంబంధం ఎడబాటుకు గురిచేసింది.అయితే రెండేళ్ళ తర్వాత భార్యను తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన భర్తకు నిరాశే ఎదురైంది.అయితే ఆమె రానని చెప్పడంతో అతను పురుగులమందుతాగి ఆత్మహత్యచేసుకొన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కూడ ఆత్మహత్య చేసుకొంది.దీంతో పిల్లలు అనాధలుగా మారారు.
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గిరిజాపురానికి చెందిన రామకృష్ణ కు ఏడేళ్ళకిందట కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లెకు చెందిన అమల అలియాస్ అమ్ములుతో వివాహమైంది. వీరికి హేమంత్, నగేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. రామకృష్ణ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మూడేళ్ళవరకు వీరి సంసారం సజావుగా సాగింది.
అయితే రామకృష్ణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయమై భార్య , భర్తల మధ్య తరచూ గొడవలు పడేవారు. రెండేళ్ళ క్రితం ఇదే విషయమై భర్తతో గొడవపడిన అమల పిల్లలను తీసుకొని తుమ్మచెట్లపల్లెకు వచ్చేసింది. ఆమె అక్కడే కూలీ పనులు చేసుకొంటూ పిల్లలను పోషిస్తోంది.రెండేళ్ల నుండి రామకృష్ణ కూడ భార్య, పిల్లలను తీసుకెళ్ళేందుకు రాలేదు.
రెండేళ్ళ తర్వాత భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకుగాను రామకృష్ణ అత్తాగారింటికి వెళ్ళాడు. ఆమె రానంటూ తిరగబడింది. పెద్దమనుషులు చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. శనివారం నాడు అమ్ములు ఓ కళాశాల వద్దకు పనికి వచ్చింది.
ఈ విషయం తెలుసుకొన్న రామకృష్ణ తనతో రావాలని ఆయన కోరాడు. అయితే అమ్ములు మాత్రం అతనితో రావడానికి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో రామకృష్ణ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో భయాందోళనలకు గురైన అమల కూడ పురుగులమందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
అయితే భార్య,భర్తలు పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు 108 లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య,భర్తలు ఇద్దరూ చికిత్స పొందుతూ మృతిచెందారు.. విషయం తెలుసుకొన్న రెండు కుటుంబాల సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొన్నారు. సమాచారం అందుకొన్న ముదినేడు ఎస్ ఐ వెంకటేశ్వర్లు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ఘటనలపై పోలీసులను విచారించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలుగా మారారు. ప్రస్తుతం పిల్లలు అమ్మమ్మ కృష్ణమ్మ సంరక్షలో ఉన్నారు.