అక్రమసంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే అంతం చేసేశారు...భారీ సుపారీతో...
కడప: ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి తమ అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కోపంతో ఏకంగా తన ప్రియురాలి భర్తనే దారుణంగా హతమార్చిన ఘటన ఇది...ఇందుకోసం తనకు సహకరించిన వారికి భారీ సుపారీ ఇవ్వడం మాత్రమే కాదు హత్య ను యాక్సిడెంట్ గా చిత్రీకరించి పోలీసులనే తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేయడం నిందితుడి నేర మనస్తత్వానికి అద్దం పడుతోంది.
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన శంకర్నాయక్ హత్యకు సంబంధించి ప్రియుడు మహేశ్వర్రెడ్డి, భార్య శైలజతో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ హత్యకు పథకం రచించిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నారని, నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సందర్భంగా వెల్లడించిన ఏఎస్పీ అనంతరం వారిని కోర్టుకు తరలించారు.
అక్రమ సంబంధం...ఏర్పడిందిలా...
ఏఎస్పీ కృష్ణారావు కథనం మేరకు హత్యా ఘటన వివరాలు....కడపకు చెందిన శంకర్నాయక్ గుంతకల్లులోని నర్సింగ్ కళాశాలలో పీఆర్వోగా పనిచేసేవాడు. భార్య శైలజ బి.మఠంలో ఏఎన్ఎంగా పనిచేసేది. చక్రాయపేటమండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే సమయంలో శైలజకు నాగులగుట్టపల్లెకు చెందిన మహేశ్వర్రెడ్డితో పరిచయం ఏర్పడి అక్రమసంబంధానికి దారితీసింది. అయితే తదనంతరం ఈ విషయం భర్త శంకర్ నాయక్ కు తెలియడంతో అతడు మహేశ్వర్రెడ్డితో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే భార్య శైలజతో కొద్దిరోజులు విడిపోయి దూరంగా ఉన్నాడు.
విడిపోయి...మళ్లీ కలిశారు...
కొంతకాలం తర్వాత పెద్దమనుషుల పంచాయతీతో భార్యభర్తలు మళ్లీ కలుసుకున్నారు. అయినప్పటికి మహేశ్వర్రెడ్డిని శంకర్నాయక్ కనబడినప్పుడల్లా దూషించేవాడని తెలిసింది. ఈ క్రమంలో శంకర్నాయక్ను అడ్డుతొలగించుకోవాలని భావించిన మహేశ్వర్రెడ్డి కడపకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తికి భారీ సుపారి ఇచ్చి శంకర్ నాయక్ హత్య పథకం రచించారు.
చంపేయాలని...భారీ సుపారీ....హత్య
నాలుగు నెలల ముందునుంచి యల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ వ్యవహారం అప్పగించి భారీ సుపారీ కూడా ఇవ్వగా...యల్లారెడ్డి...పథకం ప్రకారం శంకర్నాయక్తో స్నేహం పెంచుకున్నాడు. 4 నెలల నుంచి స్నేహం నటిస్తూ యల్లారెడ్డి అప్పుడప్పుడు శంకర్నాయక్ను మద్యం తాగించేవాడన్నారు. అదేవిధంగా జనవరి 4వ తేదీ శంకర్నాయక్కు ఫుల్గా మద్యం తాగించి అతనికి చెందిన స్కార్పియోలోనే ముతుకూర రోడ్డులోకి వెళ్లగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం యల్లారెడ్డి అనుచరులు చిన్న, పవన్కుమార్రెడ్డి, హరిహరనాథ్, ఆంజనేయరెడ్డిలు మహేశ్వరరెడ్డితో కలిసి టాటా సుమో వాహనం, మోటర్బైక్లో అనుసరించారన్నారు. ముతుకూరు రోడ్డులోకి రాగానే మద్యం మత్తులో ఉన్న శంకర్నాయక్ను రోడ్డుపై కూర్చోబెట్టి టాటా సుమో వాహనంతో గుద్ది హత్య చేశారు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి అక్కడి నుంచి పారిపోయారు.
భార్య ఫిర్యాదు...పోలీసుల అనుమానంతో...
అయితే భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో శంకర్ నాయక్ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు ఉండడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడిందన్నారు. ప్రధాన నిందితులు మహేశ్వరరెడ్డి, శైలజతో పాటు యల్లారెడ్డి, చిన్న, పవన్కుమార్రెడ్డి, హరినాథరెడ్డి, ఆంజనేయులరెడ్డి, సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుల్లో ఒకరైన సుబ్బారెడ్డి పరారీలో ఉన్నాడన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్, రూరల్ సీఐ రామకృష్ణుడు ఉన్నారు. కేసు చేధించడంలో లింగాల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, వేంపల్లె ఎస్ఐ మధుసూధన్రెడ్డి, ఆర్కేవ్యాలీ ఎస్ఐల కృషిని ఆయన మెచ్చుకున్నారు. నిందితుల నుంచి స్కా ర్పియో, టాటాసుమో, మోటర్బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.