మాంసం కూరలో మత్తు మందు కలిపి...ప్రియుడితో కలసి భర్తపై భార్య హత్యాయత్నం
గుంటూరు:తెలుగు రాష్ట్రాల్లో ప్రియులతో కలసి భర్త ను హత్య చేయడం లేదా భర్తపై హత్యాయత్నాలకు పాల్పడటం వంటి ఘటనలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన ఏడాది వ్యవధిలో ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రియుడితో కార్యకలాపాలకు భర్త అడ్డుగా ఉన్నాడనే యోచనతో కట్టుకున్నవాడిని కాటికి పంపించాలనే ప్రయత్నం చేసిన జాబితాలో మరో వివాహిత కూడా చేరింది. భోజనంలో మత్తుమందు కలిపి పెట్టి ప్రియుడితో కలసి భర్తను చంపేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ గృహిణి చేసిన విఫలయత్నం చేసింది...వివరాల్లోకి వెళితే...
బాధితుడి కథనం ప్రకారం...గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన వినుకొండ దానియేలుకు అదే గ్రామానికి చెందిన రత్నకుమారితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. ఇదిలావుంటే పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన కంభంపాటి బెంజిమెన్ అనే వ్యక్తి కేసానుపల్లి ఎస్సీ కాలనీలో చర్చి పాస్టర్ లాగా మెలిగేవాడు. ఈ క్రమంలో బెంజిమన్ కు రత్నకుమారితో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యానికి దారితీసింది.
అయితే కొన్నాళ్లకు ఈ విషయాన్ని గమనించిన గమనించిన భర్త దానియేలు పలుమార్లు బెంజిమెన్ను హెచ్చరించాడు. దీంతో భార్య రత్నకుమారి ప్రియుడు బెంజిమెన్ తో కలసి భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆ ప్లాన్ ప్రకారం ఆదివారం సాయంత్రం భోజనం పెట్టాలని భార్యను దానియేలు అడిగాడు. ఆమె ముందే ఉండి ఉంచిన మటన్ కూరలో ప్రియుడు తెచ్చి ఇచ్చిన నిద్రమాత్రలను కలిపి పెట్టింది. ఆ భోజనం తిని దానియేలు నిద్రపోయాడు. ఈ విషయం రత్నకుమారి బెంజిమెన్ కు తెలిపింది.
దీంతో రత్నకుమారి సహకారంతో బెంజిమెన్ వీరి ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న దానియేలు ముఖంపై దిండువేసి చంపేందుకు బెంజిమెన్ గట్టిగా నొక్కడం మొదలుపెట్టాడు. అయితే ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయిన దానియేలు నిద్రమత్తులోనే పెద్దపెద్దగా కేకలు వేశాడు. పక్క ఇంటిలో నిద్రపోతున్న బంధువులు ఆ అరుపులు విని చుట్టుపక్కల వారికి తెలిపారు. దీంతో తమ బండారం బైటపడుతుందని భావించిన రత్నకుమారి, ఆమె ప్రియుడు బెంజిమెన్ అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుమేరకు దాచేపల్లి ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.