అనుమానం, ఆవేశం, అంతం: చంపేస్తానని బెదిరించిన భర్త.. చంపి చూపించిన భార్య!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతని భార్య కళ్లలో కారం కొట్టి కత్తితో నరికి చంపేసింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఇంత పని చేయించింది.
మచిలీపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతని భార్య కళ్లలో కారం కొట్టి కత్తితో నరికి చంపేసింది. ఈ ఘటన ఆదివారం మచిలీపట్నం బలరామునిపేటలో జరిగింది. ఆర్పేట ఎస్ఐ అష్ఫాక్ కథనం ప్రకారంఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నానికి చెందిన పరాట మురళీధర్ (42) మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన దివ్యలత 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మురళీధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. వీరికి వెంకటసాయి శివరామకృష్ణ(13) అనే కుమారుడు ఉన్నాడు.
మురళీధర్ మరో మహిళను వివాహం చేసుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని దివ్యలతకు అనుమానం. ఈ విషయంపై భార్య, భర్తలు తరచూ గొడవ పడుతుండేవారు. నెల రోజులుగా వీరి మధ్య వివాదం మరింత రాజుకుంది. గొడవ జరిగినప్పుడల్లా మురళీధర్ కోపోద్రిక్తుడై చంపేస్తానంటూ భార్యను, కుమారుడిని బెదిరించే వాడు.
ఆదివారం మురళీధర్ స్నేహితులు దివ్యలత వద్దకు వచ్చి అతనికి సంబంధించిన ల్యాప్టాప్, ఇతర డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. కొంతసేపటికి మురళీధర్ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఓపిక నశించిన దివ్యలత భర్త కళ్లలో కారం కొట్టింది. గదిలోనే ఉన్న కత్తితో అతని మెడపై పలుమార్లు దాడి చేసింది. దీంతో మురళీధర్ అక్కడికక్కడే మరణించాడు.
తనను, తన కుమారుడిని చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని, భయపడి తానే నరికి చంపేశానని పోలీసుల ఎదుట దివ్యలత అంగీకరించింది. ఈ ఘటన మచిలీపట్నంలో సంచలనం కలిగించింది. దివ్యలత ఒక్కతే ఈ హత్యలో పాల్గొందా?, మరెవరైనా ఉన్నారా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా అనంతరం మురళీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.