భార్యను హత్యను చేసి కోళ్ళ ఫాం గుంతలో పూడ్చి ఇలా...
భార్యను హత్యచేసి అనుమానం రాకుండా వ్యవహరించిన ఓ నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
నల్లజర్ల:భార్యను హత్య చేసి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు ఓ నిందితుడు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గంగోలు గ్రామానికి చెందిన వి.రాములు, నాగమణి దంపతుల కుమార్తె వెంకటలక్ష్మిని ఆమె భర్తే హత్య చేశాడు.అయితే హత్య చేసినప్పటికీ ఈ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు.
ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం లో నివాసం ఉంటున్న రామయమ్మకు వెంకటలక్ష్మిని ఆమె తల్లిదండ్రులు చిన్నతనంలోనే దత్తత ఇచ్చారు. ఆమె అక్కడే పెరిగింది.పదేళ్ళ క్రితం నల్లజర్లకు చెందిన రాచూరి వీర్రాజుతో వివాహం చేశారు. వీర్రాజు వెంకటలక్ష్మి బంధువుల వద్ద రూ. 2 లక్షలను అప్పుగా తీసుకొని ఇల్లు కట్టాడు.
ఈ విషయంలో భార్య, భర్తల మధ్య చోటు చేసుకొన్నాయి. దీంతో గ్రామ పెద్దల పంచాయితీ నిర్వహించారు. వెంకటలక్ష్మి బంధువుల వద్ద తీసుకొన్న అప్పును తిరిగి చెల్లించడంతో పాటు ఆమెకు జూన్ 30వ, తేదిలోపుగా విడాకులు ఇవ్వాలని గ్రామపెద్దలు ఆదేశించారు.
దరిమిలా తన ఇద్దరు పిల్లలు తరుణ్ కుమార్, ధనసాయిలుతో కలిసి వెంకటలక్ష్మి అదే ఊరిలో వేరే ఇంట్లో నివాసం ఉంటుంది.అయితే గత నెల 26వ, తేది నుండి వెంకటలక్ష్మి కన్పించకుండా పోయింది. అయితే ఈ విషయమై వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు పక్కింటివారు సమాచారం ఇచ్చారు.
వెంకటలక్ష్మి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకుడా పోయింది.దీంతో వెంకటలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటలక్ష్మి భర్తపైనే తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ నెల 10వ, తేదిన అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంకటలక్ష్మి భర్త వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాన్ని ఆయన బయటపెట్టాడు. వెంకటలక్ష్మిని తానే హత్య చేశానని ఆయన చెప్పాడు. గత నెల 26వ, తేదిన వెంకటలక్ష్మిని ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోనే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు.అయితే వెంకటలక్ష్మిని హత్య చేసి శవాన్ని చీపురుగూడెం వద్దకు తీసుకెళ్ళి కోళ్ళపాం వద్ద పూడ్చిపెట్టినట్టు చెప్పాడు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.