ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ తో భర్త హత్య-సాధారణ అంత్యక్రియలు -15 రోజుల తర్వాత కాల్ రికార్డ్స్ తో..
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను కాటికి పంపిన భార్య.. ఎవరికీ అనుమానం రాకుండా సహజ మరణంగా చూపి అతని అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది. కానీ కాలం ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో ఆమెకు 15 రోజుల్లోనే అర్ధమైంది. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో కథ అడ్డం తిరిగింది. సీన్ కట్ చేస్తే జైలు ఊచలు లెక్కబెడుతోంది. ఈ 15 రోజుల్లోనే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే...
అక్రమ సంబంధం నేపథ్యం...
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరు వారి మెరకలో ఉప్పు ప్రసాద్, ప్రశాంతి అనే దంపతులున్నారు. కొంతకాలంగా గ్రామంలో ఉండే శివ అనే వ్యక్తితో ప్రశాంతికి అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు. చిన్నగ్రామం కావడంతో ఈ వివాహేతర సంబంధం ఎక్కువకాలం దాగలేదు. భర్త ప్రసాద్ కు విషయం తెలిసిపోవడంతో ప్రశాంతిని గట్టిగా మందలించాడు. అయినా మార్పు రాలేదు. భర్త ప్రసాద్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రశాంతి ప్రియుడితో కలిసి అడ్డు తొలగించుకోవాలని భావించింది.
గుట్టుచప్పుడు కాకుండా హత్య...
భార్య ప్రసాద్ ను గుట్టు చప్పుడు కాకుండా హతమార్చాలని ప్రశాంతి భావించింది. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు ఇవ్వడం ద్వారా చాకచక్యంగా భర్తను చంపేసింది. ఈ నెల రెండో తేదీన అర్ధరాత్రి 12:50 నిమిషాలకు అతడు చనిపోవడంతో సహజ మరణంగా భావించిన బంధువులు ఖననం చేశారు. బంధువులకు ప్రసాద్ సహజంగానే చనిపోయినట్లు నమ్మించింది. దీంతో వారు కూడా అంత్యక్రియలకు హాజరైనా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ప్రశాంతిని ఓదార్చి వెళ్లిపోయారు. భర్త అడ్డు తొలగిపోవడంతో ఇక అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రశాంతి సిద్దమవుతోంది. భర్త అంత్యక్రియలకు వచ్చిన బంధువులు కూడా వెళ్లిపోయాక ఇదే అదనుగా భావిస్తున్న సమయంలో ఆమెకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.
పట్టించిన కాల్ రికార్డ్స్..
భర్త చనిపోయిన పదిహేను రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ద్వారా భర్త హత్యకు ఆమె గీసిన స్కెచ్ బయటపడింది. ఆమె కాల్ రికార్డ్స్ ఆధారంగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసిందని తేలింది.. దీంతో గ్రామస్థులు కాల్ రికార్డింగ్స్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాధమిక దర్యాప్తు జరిపిన పోలీసులు హత్య నిర్ధారణ కావడంతో ప్రియుడు శివతో పాటు ప్రశాంతిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు ప్రసాద్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.