కూరగాయల కత్తితో భర్త గొంతు కోసింది (ఫొటో)
హైదరాబాద్: పక్షవాతంతో బాధపడుతూ మంచాన పడిన భర్తను పోషించలేక ఓ మహిళ తాను కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ మహిళను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ ఎసిపి ఎ. ముత్యంరెడ్డి, మైలార్దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ ఎస్. వెంకటరెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులకు వివరించారు.
బీదర్ జిల్లా బాల్కీ తాలూకా సంపూర్ గ్రామానికి చెందిన హనుమంతరావు వీరధారి (60), సంపత్ బాయి (55) భార్యభర్తలు. 40 ఏళ్ల క్రితం హైదరాబాదులోని దూద్బౌలి ప్రాంతానికి ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డారు. రిక్షా నడుపుకుంటూ కుటుంబాన్ని హనుమంతరావు పోషిస్తూ వస్తున్నాడు. 2008లో అతనికి రెండు చేతులకు పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి అతను ఇంట్లోనే ఉంటున్నాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కూర్చోబెట్టి సేవలు చేయలేనని భావించి హనుమంతరావును భార్య హత్య చేయడానికి నిర్ణయించుకుంది. ఈ నెల 10వ తేదీన కుటుంబ సభ్యులు లేని సమయంలో కూరగాయల కత్తితో భర్త గొంతు కోసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ నీళ్లు తేవడానికి వెళ్లి వచ్చేసరికి తన భర్తను ఎవరో చంపారని గగ్గోలు పెట్టింది.
తాను ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి చంపిపోయారని ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపి హనుమంతరావును భార్య సంపత్బాయి హత్య చేసిందని తేల్చుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది.