డబ్బు కోసం బావనే చంపాడు...భర్తను చంపేందుకు భార్య సహకారం
కర్నూలు: డబ్బు కోసం సోదరి భర్తనే దారుణంగా హతమార్చిన బావమరిది...హత్యకు సహకరించిన హతుడి భార్య...భర్త చనిపోవడం వల్ల వచ్చే డబ్బుతో ప్రియుడితో ఎంజాయ్ చేయొచ్చని భావించిన భార్య...ప్రియురాలి కోసం హత్యా పథకంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడు...ఈ ఒక్క ఉదంతమే నేటి కాలంలో మంటగలిసిపోతున్నసంబంధం బాంధవ్యాలు...మానవతా విలువలకు అద్దం పడుతోంది. బావతో పెద్ద మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించి...సోదరికి డబ్బు ఆశ చూపించి ఆమె భర్తను హత్య చేయించడంతో పాటు రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాడు బావమరిది.
అయితే హతుడి బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. కర్నూలు డీఎస్పీ ఖాదర్ బాషా, సీఐ నాగరాజుయాదవ్, ఓర్వకల్లు ఎస్సై మధుసూదన్రెడ్డిలు బుధవారం ఆ వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే...
వ్యాపారం...ఆరోపణలు
ప్రకాశం జిల్లా కృష్ణంశెట్టి పల్లెకు చెందిన అరవీటి రమేష్ హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటూ శ్రీ చక్ర లూబ్రికెంట్ ఆయిల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రమేష్ వద్దే అతడి సోదరి రమాదేవి, ఆమె భర్త శ్రీనివాసులు వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామం. లూబ్రికెంట్ వ్యాపారం చేసే రమేష్ అతడి మొదటి భార్యను చంపాడని, డబ్బు కోసం ఆమె పేరిట పెద్ద మొత్తానికి ఇన్సూరెన్స్ చేయించి ఆ తరువాత పథకం ప్రకారం చంపాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ తరువాత...టార్గెట్ బావే
ఈ క్రమంలో ఇన్సూరెన్స్ డబ్బు పొందటంపై బాగా అవగాహన్న ఉన్న రమేష్ మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు మరో పథకం సిద్దం చేసుకున్నాడు. ఆ ప్రకారం తన బావ శ్రీనివాసులు పేరిట రూ.2 కోట్లుకు ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ తరువాత తన సోదరి రమాదేవికి నీ భర్తను చంపేస్తే భారీగా డబ్బు వస్తుందని చెప్పాడు. అప్పటికే చోలవీడు సర్పంచి మధుసూదన్రావుతో వివాహేతర సంబంధం కలిగివున్న రమాదేవి భర్తను ఎలాగైలా వదిలించుకోవాలని చూస్తోంది. ఆ క్రమంలో సోదరుడు పెట్టిన ప్రతిపాదనకు వెంటనే అంగీకరించి భర్త హత్యకు సహకరించేందుకు ఒప్పుకుంది. ఇందుకు రమేష్, అతడి భార్య శివప్రణీతలు రమాదేవితో మాట్లాడి ఒప్పించారు.
హత్యకు పథకం...అమలు ఇలా...
శ్రీనివాసులు పేరిట ఇన్సూరెన్స్ చేయడమే కాకుండా అతని పేరున స్కోడా, మహేంద్ర ఎక్స్యూవీ వాహనాలను కొనుగోలు చేశారు. ఇక అతడి హత్యకు పథకం సిద్దం చేశారు. దీంతో శ్రీనివాసులు భార్య రమాదేవి ప్రియుడు కూడా రంగంలోకి దిగాడు. రమేష్ తనవద్ద పనిచేసే షేక్ మోమిన్ యాసిన్ బాషా, పుసుపుల రమణలకు శ్రీనివాసులను హత్య చేసే కాంట్రాక్ట్ అప్పగించి ఆ తరువాత పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ పథకం ప్రకారం యాగంటికి వెళదాం రమ్మంటూ అంటూ 2018 జనవరి 24న వీరంతా కలసి కర్నూలుకు వచ్చారు. స్థానిక హోటల్లో బసచేసి మరుసటిరోజు తెల్లవారుజామున యాగంటికి బయలుదేరారు. ఓర్వకల్లు మండలం చెన్నంశెట్టి పల్లె దాటిన తర్వాత రమేష్ తన పర్సు హోటల్లో మరిచిపోయాను కర్నూలుకు వెళ్లి తెచ్చుకుంటానని నమ్మించి కర్నూలు వెళ్లిపోయాడు.
లారీ కింద తోసి...గొంతు పిసికి...
కాసేపు సరదాగా నడుద్దామంటూ శ్రీనివాసులుతో బయలుదేరిన రమణ, మోమిన్ బాషా...తమకు ఎదురుగా ఒక లారీ వస్తుండటం గమనించి అదే సరైన సమయంగా భావించి అతడిని లారీ కిందకు తోశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు ఇంకా కొన ఊపిరితో కొట్టుకుంటుండగా అతడు బ్రతికితే ప్రమాదమని భావించిన రమణ, యాసిన్ బాషా అతడి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత రమేష్, రమణ, యాసిన్ బాషాలు ఓర్వకల్లు పోలీసుస్టేషన్కు వెళ్లి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శ్రీనివాసులు చనిపోయినట్లు పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే హతుడి బంధువులు ఈ మరణంపై అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బైటపడింది. హత్య పాత్రధారులైన రమణ, షేక్ మోమిన్ యాసిన్ బాషా లొంగిపోగా ప్రధాన సూత్రధారులు అందరూ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.