విజయవాడలో భార్యా బాధితుల సంఘం సమావేశం...సంచలన నిర్ణయం
విజయవాడ:ఈసారి భార్యా బాధితుల సంఘం సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో వీరు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది తమ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చాలనే నిర్ణయం తీసుకోవడమే ఆ నిర్ణయం.
సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ అన్ని చట్టాలు భార్యలకు అనుకూలంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యల కారణంగానే ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని ఈ సందర్భంగా భార్యా బాధితుల సంఘం ఆరోపించింది. మరోవైపు విజయవాడ నగరంలో ఏర్పాటుచేసిన ఈ భార్యాబాధితుల సమావేశం చర్చనీయాంశంగా మారింది.
భార్యాబాధితులు ఎక్కువమంది ఉన్నందున తెలుగు రాష్ట్రాలతో పాటు ఆలిండియా లెవల్లో భార్యా బాధితుల సంఘం ఏర్పాటు చేసుకున్నామని భార్యా బాధితుల సంఘం ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ సమావేశంలో తమ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్న భార్యాబాధితులు అందుకు తగిన ఏర్పాట్లు ఆరంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు వచ్చే నెలలో హైదరాబాద్ లేదా విజయవాడలో భార్యాబాధితులతో 1కే రన్ నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. కొన్ని చట్టాలను అనుకూలంగా చేసుకుని భార్యలు తమ భర్తలను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. సెక్షన్ 498 కేసు ఉన్నా...ఒక ఏడాది తర్వాత తమకు రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెయింటెన్స్, డొమెస్టిక్ వయలెన్స్ను ఆ చట్టం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
తెలుగు నాట భార్యాబాధితుల సంఘం గురించి బాగా ప్రచారం వచ్చింది ప్రముఖ సినీ నటుడు,న్యాయవాది తొలి తెలుగు 'భార్యాబాధితుల సంఘం' వ్యవస్థాపకుడు అయిన సివిఎల్ నరసింహారావు ద్వారా...అయితే ఆయన భార్యాబాధితుడా కాక పోవడం ఒక వివేషమైతే...ఆ సంఘం పెట్టాలనే ఆలోచనే తనదని ఆయన సతీమణి అనురాధ గారు పేర్కనడం ఇంకో విచిత్రం.
మరోవైపు జాతీయ స్థాయిలో చూస్తే నెలక్రితం దాదాపు 150 మంది భార్య బాధితులు గంగానదీ తీరంలో 'పిశాచ ముక్తి పూజలు' చేయడం సంచలనం సృష్టించింది. వారి దృష్టిలో పిశాచాలంటే వారి మాజీ భార్యలే. ఆ స్మృతుల నుంచి విముక్తి కోరుతూ, బతికుండగానే వారికి పిండ ప్రదానం చేశారీ బాధిత పురుష పుంగవులు! సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరిట ఆ పూజలు సాగించారు. అలాంటి మహిళలు విషజ్వాలల వంటివాళ్లని...వాళ్ల నుంచి ప్రపంచాన్ని విడిపించాలనే మేమంతా ఇక్కడ గంగాస్నానాలు చేశామని...దేశంలోని పలు ప్రాంతాలవారు మా సంఘంలో ఉన్నారని ఈ సందర్భంగా సదరు భార్యా బాధితులు వెల్లడించారు .