త్వరలోనే అన్ని అర్బన్ ఏరియాలకు వైఫై:చంద్రబాబు;అమరావతిపై బీజేపీ, వైసీపీ విషం:బుద్ధా వెంకన్న
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ. 149కే ఇంటర్నెట్, టీవీ చానల్స్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే అన్ని అర్బన్ ఏరియాల్లో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు ఆటోమేటిక్ డేటా యాక్సెస్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
తద్వారా ప్రతి డిపార్టుమెంట్కు వేరే డిపార్ట్మెంట్ డేటాను యాక్సెస్ చేసే సౌలభ్యం ఉంటుందని వివరించారు. దీనివల్ల పౌర సేవలు సత్వరం పూర్తిచేయడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు వినూత్నమైన ఆలోచనగా సీఎం చంద్రబాబు కితాబునిచ్చారు. సర్టిఫికెట్ లెస్, పేపర్ లెస్ సేవలకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు.
మరోవైపు ప్రజా రాజధాని అమరావతిపై బీజేపీ, వైసీపీ విషం కక్కుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బిజెపి,వైసిపి నేతలు కుట్ర రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. వైసీపీ, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని, ఆ విషయం స్పష్టంగా అందరికీ అర్ధమవుతోందని అన్నారు.
వైసిపి మోసానికి ప్రతిగా 2019లో వైసీపీకే కాకుండా, ఆ పార్టీ మాటలు నమ్మి ఎపి ప్రజలను దారుణంగా వంచించిన బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు.