జగన్తో భేటీ ఎఫెక్ట్.. ఆనం వర్గంపై టీడీపీ వేటు: వైసీపీలోకి వెళ్లడం లేదా?
నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారో తెలియడం లేదు. మరోవైపు ఆయన వర్గంపై టీడీపీ వేటు వేసేందుకు సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది. ఆయన ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్ను కలిశారు. దీంతో ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని టీడీపీ భావిస్తోంది.
చిరంజీవి మాటేమిటి?: పవన్కు టీడీపి దిమ్మతిరిగే కౌంటర్, 'జగన్పై నా కూతురు పోటీ'
ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆనం ఇంచార్జిగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళనకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఆయనపై నేరుగా చర్యలు తీసుకోకుండా ఆయన వర్గీయులుగా ముద్రపడిన వారిని పదవుల నుంచి తప్పించనున్నారని తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.
ఆనం పునరాలోచన చేస్తారని చూసి చూడనట్లు
ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో ఆయన వర్గీయులైన మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన దళితతేజంలో వారి భాగస్వామ్యం లేదని అంటున్నారు. ఆనం పార్టీ మార్పుపై పునరాలోచన చేస్తారని ఇన్నాళ్లు టీడీపీ చూసి చూడనట్లుగా వ్యవహరించిందని, ఇప్పుడు ఆయన వెళ్లడం ఖాయమని తేలిందని, కాబట్టి ఆయన వర్గీయులపై చర్యలకు సిద్ధమవుతోందని అంటున్నారు.
కొత్తవారికి నియోజకవర్గ బాధ్యతలు
ఆత్మకూరు ఇంచార్జిగా తనను నియమించిన తర్వాత ఆనం మార్పులు చేర్పులు చేశారు. తనవారిగా ముద్రపడిన వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం టీడీపీని ఆలోచనలో పడేసింది. ఆనం పార్టీ మారితే వీరు కూడా ఆయన వెంటే నడుస్తారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ విధేయులకు, సమర్థులకు పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలను కూడా కొత్త వారికి అప్పగించాలని చూస్తున్నారు.
జగన్తో భేటీ తర్వాతే టీడీపీ కసరత్తు
ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల వైసీపీ అధినేత జగన్ను కలిశారు. దీంతో పార్టీ మారడం ఖాయమని భావిసతున్నారు. ఆనం బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ఆగకుండా పార్టీయే కసరత్తు ప్రారంభిస్తోంది. కాగా, ఆనం నాలుగైదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో పది నిమిషాల పాటు జగన్తో భేటీ అయ్యారు. అప్పటి నుంచే టీడీపీ కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది.
వైసీపీలో చేరాలని నిర్ణయానికి రాలేదా?
జగన్తో భేటీ అయినప్పటికీ ఆనం ఇంకా వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇరువురి మధ్య ఏమైనా షరతులు చోటు చేసుకోవడంతో ఆగిపోయిందా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆగస్టు నెలలో ఆనం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.