'కేరళ' విపత్తు చూసైనా...ఆంధ్రప్రదేశ్ జాగ్రత్త పడుతుందా?...
Recommended Video
అమరావతి:కేరళలో వరద భీభత్సంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోగా లక్షలాదిమంది నిరాశ్రయులుగా మారారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే కేరళలో రూ. 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందని...ప్రజా జీవనం అల్లకల్లోలంగా మారిన కేరళ మళ్లీ కుదురుకోవడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు.
అయితే వర్షాలను ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు కానీ అందువల్ల జరిగే నష్టాన్ని కొంతయినా నిలువరించలేమా?....అందుకు అవకాశం లేదా అంటే ఉందనే అంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకునేముందు ఈ కేరళ విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ జాగ్రత్త పడాల్సిందేమైనా ఉందా అంటే...చాలా ఉందంటున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రకృతి విపత్తులు...నష్ట నివారణ
కేరళలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వర్షాలు కురిసి ఆ రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకృతి విపత్తులను గురించి ముందుగానే ఆలోచించడం...అవి విరుచుకుపడే అవకాశాలను అంచనా వేయడం...అందుకు తగినట్లుగా ముందు జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆ విపత్తుల నుంచి నష్టాన్ని వీలైనంత తగ్గించవచ్చనేది అనాది నుంచి వాతావరణ శాస్త్రజ్ఞుల సూచన. అంతేకాదు ప్రాంతాలవారీగా ప్రకృతి విపత్తులు వేర్వేరుగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు తగినట్లుగా చర్యలు ఉండాలనేది వారి ప్రధాన సూచనల్లో ఒకటి.
కేరళతో...ఆంధ్రప్రదేశ్కు పోలిక
కేరళకు...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అంశాల్లో సారూప్యత వుంది. అదెలాగంటే...పడమటి కనుమలు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి వుండగా తూర్పు కనుమలు ఒడిషా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు మీదుగా కేరళ వరకు విస్తరించివున్న విషయం తెలిసిందే!..పడమటి కనుమల పర్వత పాదాల వద్దనే కేరళలోని అనేక పట్టణాలు, గ్రామాలు వున్నట్టే ఎపిలోనూ వున్నాయి. కేరళలో ఎత్తునవున్న ఆవాసానికీ సముద్రానికీ వున్న స్లోప్ కూడా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బాహుదా బేసిన్ (ఇచ్ఛాపురం) మొదలు గోదావరి బేసిన్ (సుమారు ఏలూరు) వరకూ దాదాపు ఇలాంటి పరిస్థితేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
అపార నష్టం...కారణాలు
పడమటి కనుమల్లో కురిసిన భారీ వర్షాలు కేరళలో విలయానికి కారణమయ్యాయి. వర్షించిన అతి తక్కువ సమయంలో భూమికి, అక్కడినుండి నదులకు, అరేబియా సముద్రానికీ ఆ ప్రవాహాలు కదం తొక్కుతాయి కాబట్టే అక్కడ అంత నష్టం జరిగింది. ఎగువన కురిసిన వర్షాలు, ఆ కారణంగా నదుల్లో నీటి మట్టాల పెరుగుదలనుబట్టి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడానికి మానిటరింగ్ కేంద్రాలను, 'వరద ప్రమాద హెచ్చరిక వ్యవస్థ'లను నది పొడవునా నిర్ణీత దూరాల్లో కేంద్ర జలవనరుల సంఘం ఏర్పాటు చేస్తుంది. అయితే కేరళలోని నదులకు 22 మోనిటరింగ్ స్టేషన్స్ వున్నా ఫోర్కాస్ట్ సెంటర్ ఒక్కటి కూడా లేకపోవడం అపార నష్టానికి దారితీసింది. దీంతో కేవలం 3..4 గంటల ముందే సమాచారం పొందగలిగే పరిస్థితి ఏర్పడింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేలోపే ముంపు ముంచుకురావడం అనేకచోట్ల దారుణ నష్టానికి కారణమైంది. అయితే యుపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో 22 నుండి 48 గంటల ముందుగానే హెచ్చరికలు రావడం గమనార్హం.
ఇక...ఎపి విషయానికొస్తే
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, కృష్ణా, గోదావరి, తుంగభద్రలకు కొంత అవకాశం వున్నా ఉత్తరాంధ్ర లోని వంశధార, నాగావళి, బాహుదా, శారదా నదులతోపాటు గోదావరి ఉపనది శబరికీ ఎప్పుడూ ఆకస్మిక వరదలే వస్తుంటాయి. కాబట్టి మనకూ పొంచివున్న ఈ ప్రమాదాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. తూర్పు కనుమలు విస్తరించివున్న విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల ఏజన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ చేయాలని ప్రభుత్వాలు తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. గిరిజనులు, పర్యావరణ ప్రేమికులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా పాలకులకు మాత్రం అవేమీ పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నాల్కో తవ్వకాలకు ముందుకొచ్చిందని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.
చేజేతులా...చేసుకోవద్దు
సహజంగా బాక్సైట్ ఖనిజం వున్నమేర, లక్ష ఎకరాలకు పైబడి కొండలలో స్పాంజి మాదిరిగా మట్టి ఏర్పడి నీటిని పీల్చుకొనే శక్తి కలిగివుంటుంది. అందువల్ల కురిసిన వర్షం అందులోకి ఇంకి, ఆ తరువాత నిదానంగా మైదాన ప్రాంతాలకు జాలువారుతోంది. అదే ఆ ఖనిజాన్ని తవ్వేస్తే వర్షపు నీరు వేగంగా దిగువకు పారుతుంది. దీంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఆకస్మిక వరదల బారిన పడతాయి. అధిక వర్షపాతం గల జిల్లా గనుక ఈ ప్రమాదం తరుచూ సంభవించే అవకాశం ఉంటుంది. పైగా నిలకడగా ఏడాది పొడవునా స్టీల్ ప్లాంట్కు, విశాఖ నగరానికీ నీరందించే ప్రస్తుత పరిస్థితి కూడా మారిపోవచ్చనేది పర్యావరణ నిపుణల అంచనా. ఒక్కసారిగా నీరంతా సముద్రానికి పొర్లిపోయి, ఆ వెంటనే నీటి వనరులు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున పరిశ్రమల మనుగడ, నగర జీవనం అస్తవ్యస్తమైపోతాయి.
కేరళకు అంత...ఆంధ్రకు ఇంత
కేరళకు సముద్ర తీరం 569 కి.మీ. మేరా వుండగా ఆంధ్రప్రదేశ్కు 973 కి.మీ. పొడవున వుంది. అయితే కేరళ భూభాగంలో దాదాపు పది శాతం సముద్ర మట్టానికి దిగువన వుండగా ఎపికి అలాంటి పరిస్థితి లేదు. కాని, ఇలిమినైట్వంటి ఖనిజాల కోసం సముద్ర తీరంలోని ఇసుకను విచ్చలవిడిగా తవ్వేస్తు న్నారు. దాంతో కెరటాల తీవ్రతకు తీరం కోసుకుపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక రిలయన్స్, ఒఎన్జిసి వంటి సంస్థల చమురు బావులవల్ల కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం వాస్తవం. చమురు, సహజ వాయువును భారీగా తోడుకొని పోతున్నందున భూమట్టాల్లో తేడాలు వచ్చి వివిధ సమస్యలతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం కూడా పొంచి వుంది. అదే జరిగితే పచ్చటి కోనసీమ పరిస్థితి దారుణంగా మారిపోతుందని...అందుకే వీటన్నింటి విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలనేది వారి విజ్ఞప్తి.