కేసీఆర్పై మత్తయ్య ఫిర్యాదు: ఏపీ పోలీసులకు చిక్కులా?
విజయవాడ: ఓటుకు నోటు కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో జెరూసలేం మత్తయ్య ఏ 4 నిందితుడిగా ఉన్నాడు. ఇతను తమ ఆదీనంలో లేడని సీఐడీ ఎస్పీ కోటేశ్వర రావు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.
మత్తయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురి పైన విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
అయితే, వేరే రాష్ట్రంలో నిందితుడైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఫిర్యాదు ఎలా తీసుకున్నారని కూడా అంటున్నారు. ఇది ఏపీ పోలీసులకు చిక్కులు తెస్తోందని అంటున్నారు. దీనిపై మరో వాదన కూడా ఉంది. వేరే రాష్ట్రంలో మత్తయ్య నిందితుడనే సమాచారం లేకుంటే ఎలా తెలుస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
కాగా, ఓటుకు నోటు కేసులో మత్తయ్య కాల్ డేటాను సీఐడీ అధికారులు సేకరించారు. మత్తయ్యకు ఫోన్ చేసిన నేతలు, అధికారుల వివరాలను సేకరిస్తున్నారు. తనకు ప్రాణభయం ఉందని చెప్పడంతో మత్తయ్యను సీఐడీ తమ రక్షణలోనే ఉంచుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.