జగన్ తో ఓవైసీకి చెడిందా ! ఏపీలో వరుస పర్యటనలతో వైసీపీపై ఒత్తిడి
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో పర్యటించారు. ఎన్సార్సీ, సీఏఏ, ఎన్.పి.ఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభల్లో ఓవైసీ పాల్గొన్నారు. ముస్లింలు నిర్వహించిన ఈ సభలకు హాజరవడం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు లౌకిక ఓటుబ్యాంకులోనూ చీలిక తెచ్చినట్లు కనిపిస్తోంది.
ఓవైసీ- జగన్ స్నేహం- తాజా పరిణామాలు
2014 ఎన్నికలకు ముందు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనకు జగన్మోహన్ రెడ్డి స్నేహితుడని ప్రకటించారు. ఆ తర్వాత కూడా పలు విషయాల్లో జగన్ కు స్నేహహస్తం అందించిన ఓవైసీ.. 2019 ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తానని కూడా వెల్లడించారు. కానీ ఓవైసీ రావాల్సిన అవసరం లేకుండానే జగన్ 151 సీట్లతో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఒకరి గురించి మరొకరు స్పందించిన సందర్బాలూ లేవు. అయితే తాజాగా పార్లమెంటులో వైసీపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు మద్దతుగా పార్లమెంటులో ఓటేయడం ఓవైసీకి ఆగ్రహం తెప్పించింది.
ఎన్సార్సీపై జగన్ కు హెచ్చరికలు
సీఏఏపై పార్లమెంటులో వైసీపీ అనుసరించిన తీరుపై ఆగ్రహంగా ఉన్న ఓవైసీ జగన్ తప్పు చేస్తున్నారని సుతిమెత్తగా హెచ్చరించడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత కూడా వైసీపీ వైఖరిలో మార్పు లేదు. ఆ తర్వాత ఏపీలోనూ సీఏఏ, ఎన్సార్సీ, ఎన్.పి.ఆర్ కు వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు జరగడంతో రాష్ట్రంలో ఎన్సార్సీని ఏ రూపంలోనూ అమలు చేయబోమని సీఎం జగన్ కడపలో ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఓవైసీ శాంతించలేదు. ఎన్సార్సీ అమలుకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ట్రంలో దాన్ని అమలు చేయబోమంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఓవైసీ సూచించారు. అయినా వాటిని జగన్ పట్టించుకోలేదు.
నేరుగా రంగంలోకి దిగిన ఓవైసీ
ఎన్సార్సీ అమలుపై రెండు నెలల క్రితం వరకూ హెచ్చరికలకే పరిమితమైన ఓవైసీ .. జగన్ ప్రభుత్వ వైఖరితో ఇక నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా విజయవాడ, గుంటూరులో ముస్లింలు నిర్వహించిన బహిరంగ సభల్లో ఓవైసీ పాల్గొన్నారు. అదే సమయంలో ఆయనతో కలిసి టీడీపీ, వైసీపీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. గుంటూరు సభలో అయితే ఎన్నార్సీ అమలు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఓవైసీ సమక్షంలోనే ప్రకటించారు. ఈ సభ జరగడానికి రెండు రోజుల క్రితం కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఇదే ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన ఇద్దరు మైనార్టీ నేతల ప్రకటనల వెనుక ఓవైసీయే కారణమనేది బహిరంగ రహస్యం.
ఓవైసీ రాకతో వైసీపీపై పెరిగిన ఒత్తిడి
ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ రాకతో ఏపీలో వైసీపీపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం వర్గాల్లో ఓవైసీ ప్రకటనలు బలమైన ప్రభావం చూపుతుండగా.. వైసీపీపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రస్తుతానికి రాష్ట్ర అవసరాల పేరుతో కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతున్న వైసీపీ.. ఏ క్షణాన అయినా బీజేపీ మాట విని ఎన్నార్సీ అమలు చేయదన్న నమ్మకం ఏంటన్న వాదన ముస్లిం వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో ముస్లింల్లో భయాందోళనలు నింపుతోందన్న కారణంంతో ఎన్.పి.ఆర్ అమలును కూడా వైసీపీ ప్రభుత్వం పక్కనబెట్టాల్సి వచ్చింది. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలు ఏమిటో కూడా తెలియకుండానే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
ఓవైసీ ఎంట్రీ టీడీపీకి మేలు చేస్తుందా ?
ఎన్సార్సీకి వ్యతిరేకంగా ఏపీలో ఓవైసీ వరుస పర్యటనలు అంతిమంగా ఎవరికి మేలు చేస్తాయన్న చర్చ మొదలైంది. రాజకీయంగా చోటు చేసుకునే భవిష్యత్ పరిణామాలకు హేతువుగా మారిన ఓవైసీ పర్యటనలు... వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈ నష్టం విపక్ష టీడీపీకి కాస్తో కూస్తో మేలు చేస్తాయనే అంచనా ఉంది. ఎందుకంటే ఎన్సార్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎంఐఎంకు ఏపీలో ఎలాంటి బలం, బలగం, క్యాడర్ కానీ లేవు. అటువంటప్పుడు వైసీపీపై అది పెంచే వ్యతిరేకత కచ్చితంగా ఎవరో ఒకరికి బదలాయింపు కాక తప్పదు. అదే జరిగితే టీడీపీకి అనుకూలంగా ఈ ప్రభావం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కనిపించినా ఆశ్చర్యం లేదు.