మాధవ్ గెలుపు - పురంధేశ్వరి లేఖ: బీజేపీ మనసులో ఏముంది? టిడిపి ఆందోళన
జాతీయస్థాయిలో బీజేపీ వరుస విజయాలతో మంచి ఉత్సాహంలో ఉంది. దీంతో దక్షిణాదిపై కూడా దృష్టి సారించింది. కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బాగా ఎదగాలని భావిస్తోంది.
విశాఖ: జాతీయస్థాయిలో బీజేపీ వరుస విజయాలతో మంచి ఉత్సాహంలో ఉంది. దీంతో దక్షిణాదిపై కూడా దృష్టి సారించింది. కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బాగా ఎదగాలని భావిస్తోంది. విపక్షంగా ఉన్నా, మిత్రపక్షంగా ఉన్నా దక్షిణాదిలో కమల వికాసమే టార్గెట్ అంటున్నాయి.
ఇక, ఏపీ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత బీజేపీ నేతలు మరోసారి మిత్రపక్షం, అధికార టిడిపిపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదిగే ఉద్దేశ్యంలో భాగంగా గతంలో కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు అధికార పార్టీపై నిప్పులు చెరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశం తెరపైకి రావడంతో బీజేపీ ఇరుకున పడింది. ఇటీవల ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో బీజేపీకి ఏపీలో మరోసారి కొంతలో కొంత వెసులుబాటు వచ్చింది.
హోదా చిక్కు నుంచి బయటపడి..
హోదా చిక్కుతో కొద్దిరోజుల పాటు మౌనంగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ టీడీపీపై దాడి చేస్తున్నారు. వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటివ్వడంపై అధిష్టానానికి పురంధేశ్వరి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం.
ఇక విషయానికి వస్తే, ఇటీవల ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ నేత గెలిచారు. దక్షిణాదిన పాగా వేయడానికి ఉత్తరాంధ్రలో లభించిన విజయమే తార్కాణమనీ బీజేపీ నేతలు భావిస్తున్నారు.
మాధవ్ గెలుపుతో బీజేపీలో ఉత్సాహం
ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి బలపరిచిన బీజేపీ అభ్యర్థి పివిఎన్ మాధవ్ గెలిచారు. గడచిన రెండుసార్లు పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఎమ్వివి శర్మ గెలిచారు. ఈసారి మాత్రం.. బీజేపీ సీనియర్ నేత పివిచలపతిరావు కుమారుడిగా, ఆరెస్సెస్ కార్యకర్తగా, మితభాషిగా, విషయ అవగాహన ఉన్న విద్యావేత్తగా పివిఎన్ మాధవ్ పైన చాలామందిలో సానుకూల దృక్పథం ఉంది. ఆయనపై ఉన్న సానుకూలతనే గెలిపించిందని అంటున్నారు.
ఈ విషయాన్ని బీజేపీ కూడా అంతర్గతంగా అంగీకరిస్తోందని చెబుతున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం పెద్దగా చేసిందేమీ లేదన్న భావన ఈ ప్రాంత ప్రజలలో ఎంతో కొంత ఉందని అంటున్నారు. విశాఖకు రైల్వే జోన్ కీలకమైన అంశమని చెబుతున్నారు.
బీజేపీ డిమాండ్
అయినప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ గెలిచారు. సొంత ఇమేజ్ కారణమని చెబుతున్నారు. మాధవ్ కాకుండా మరెవరు బీజేపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయి ఉండేవారని అంటున్నారు. ఇలాంటి వాటిని చూపించి బీజేపీ తమకు ఇమేజ్ పెరుగుతోందని, వాపును చూసి బలుపు అనుకుంటోందని అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీ మరోసారి టిడిపిని విమర్శించే అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఇదే మంచి తరుణమని బిజెపి, టిడిపి నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఊపుతో జీవీఎంసీ ఎన్నికల్లోను సత్తా చాటుతామని భావిస్తున్నారు. కార్పొరేషన్లో సగం సీట్లను తమకు కేటాయించాలన్న డిమాండ్తో పాటు మేయర్ లేక డిప్యూటీ మేయర్ పదవులలో ఒకటి తమకు కేటాయించాలని బీజేపీ... టిడిపిని డిమాండ్ చేస్తోంది. దీనిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై టిడిపి తర్జన భర్జన పడుతోంది.
టిడిపిలో ఆందోళన
కేంద్రంతో సత్సంబంధాలకు టిడిపి ప్రాధాన్యం ఇస్తోంది. కానీ జీవీఎంసీలో బీజేపీ డిమాండ్లు, సర్దుబాటు తమ పార్టీ ఉనికికి చేటు తెచ్చేలా ఉందని స్థానిక టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపు ఆనందాన్ని ఇస్తున్నా, దీనిని తమ బలమని కమలం పార్టీ నేతలు జబ్బలు చరచుకోవటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోవడం లేదంటున్నారు. ఈ నేపథ్ంలో టిడిపి-బిజెపి మధ్య బంధం బలపడుతుందా, బీటలు వారుతాయా అనే చర్చ కూడా సాగుతోంది.