హోదా కోసం ప్రయత్నం: సుజన, రాష్ట్రాల సమస్యలొద్దు: వెంకయ్య కండిషన్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి సోమవారం అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మా ప్రయత్నాలు మేం చేస్తున్నామన్నారు.
అఖిలపక్ష సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పానన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని కోరుతామన్నారు. చట్టంలోని హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు లోపల, బయట ఒత్తిడి తెస్తామన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ప్రాధాన్యత అంశంగా చర్చించాలని కోరుతామన్నారు. ఇప్పటికి రాష్ట్రం విడిపోయి 14 నెలలు కావొస్తున్న సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఎన్డీయే భూసేకరణ బిల్లుకు మద్దతిస్తామన్నారు.
వెంకయ్య నాయుడి షరతు!!
అంతకుముందు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన అఖిల పక్షం సమావేశమయింది. ఈ సమావేశానికి ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.
మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తాము అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని చెప్పారు. రాష్ట్రాల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించవద్దని సూచించారని తెలుస్తోంది. పార్లమెంటు కార్యకలాపాలను శాసించే యత్నం చేయవద్దని, ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు.