లోకేష్ కోసం.. నంద్యాల వైపు: చంద్రబాబు అక్కడి నుంచి పోటీ చేస్తారా?
2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది.
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది.
చదవండి: రాజమౌళి లండన్ టూర్ ఖరారు, విమర్శలపై బాబు ఘాటుగా: ఉద్యోగులకు భారీ ఆఫర్
కుప్పం నుంచి లోకేష్ పోటీకి ఛాన్స్
ప్రధానంగా ఇప్పటి వరకు తన తండ్రి, సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు మరో నియోజకవర్గానికి వెళ్లనున్నారని అంటున్నారు.
చంద్రబాబు పోటీపై ఆసక్తికర ప్రచారం
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేయవచ్చు కదా అనే చర్చ టిడిపి నేతల్లో జరుగుతోందని అంటున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నంద్యాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి
ఇటీవల జరిగిన నంద్యాల ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. స్వల్ప మెజార్టీతో ఏదో పార్టీ గట్టెక్కుతుందనుకుంటే టిడిపి ఏకంగా 27 వేల పై చిలుకు మెజార్టీతో గెలుపొందింది. అంతేకాదు, నంద్యాలలో టిడిపిని గెలిపించినందుకు చంద్రబాబు ప్రత్యేక దృష్టి కూడా సారించారు.
అంతా వట్టి ప్రచారమేనా?
ఈ నేపథ్యంలో 2019లో చంద్రబాబు కుప్పంను తన తనయుడు లోకేష్కు వదిలి, నంద్యాల నుంచి పోటీ చేయనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. అదే జరిగితే ఇప్పుడు గెలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నే. అంతకంటే ముందు.. ఇదంతా కేవలం వట్టి ప్రచారంగానే చాలామంది భావిస్తున్నారు.
బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం
లోకేష్కు కుప్పం వదిలితే వదలొచ్చు. కానీ నంద్యాల నుంచి పోటీ మాత్రం వట్టిదే అంటున్నారు. ఇంతకుముందు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జరిగింది. అంతేకాదు ఆమె గుంటూరు లేదా విజయవాడ నుంచి పోటీ చేయవచ్చునని కూడా రూమర్లు సృష్టించారు. కానీ ఆ పరిస్థితి ఉండదని టిడిపి నేతలు చెబుతున్నారు.