బీసీ సీఎం!: టీడీపీకి దమ్ముందా... చంద్రబాబుకు బీజేపీ గట్టి కౌంటర్, జగన్ కూడా సిద్ధం!!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు సరికొత్త సవాల్ విసురుతున్నారు. ఓ విధంగా ఆయన చేయలేని సవాల్ విసురుతున్నారు.
సునీతకు భారీ షాక్.. పరిటాల రవి కీలక అనుచరుడి తిరుగుబాటు: వైసీపీలోకి, ఎందుకంటే?
చంద్రబాబుకు సవాల్
ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'జయహో బీసీ' పేరుతో బీసీ సభను నిర్వహించారు. అదే టీడీపీ నేతలు పదేపదే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గట్టి సవాల్ విసిరారు. ఓ విధంగా టీడీపీ, చంద్రబాబు చేయలేని సవాల్ విసిరారని అంటున్నారు.
మేం ఇచ్చాం.. మీరు ఇవ్వగలరా?
బీజేపీ బీసీ నేత అయిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని చేసిందని, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఆ దమ్ముందా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పగలరా, అంత దమ్ముందా అని అభిప్రాయపడ్డారు. టీడీపీ విషయానికి వస్తే.. ఇప్పుడు చంద్రబాబు.. తర్వాత లోకేష్ అనే పేరు వినిపిస్తోంది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేత ఆర్ కృష్ణయ్యను సీఎంగా ప్రకటించారు చంద్రబాబు. కానీ ఏపీలో ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ సభకు వైసీపీ కౌంటర్
ఇదిలా ఉండగా, టీడీపీ జయహో బీసీ సభకు కౌంటర్గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ సభను ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో వైసీపీ.. బీసీ గర్జన పేరుతో సభ నిర్వహించనుంది. ఈ గర్జనలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నారు. తద్వారా టీడీపీకి గట్టి కంటర్ ఇవ్వనున్నారు.