కాపులకు సీఎం పోస్ట్ ! చంద్రబాబు ఆఫర్ పవన్ కోసమా ? వలసల్ని ఆపేందుకా ?
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటివరకూ కొనసాగిన రాజకీయమే భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న నమ్మకం లేదు. ఏ రోజు, ఏ రాత్రి ఎలా మారుతుందో తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా అధికారానికి దూరం చేసేందుకు విపక్షాలు చేస్తున్నప్రయత్నాలు ఇప్పుడు రాష్ట్రంలో కాకపుట్టిస్తున్నాయి. తాజాగా విపక్ష నేత చంద్రబాబు తాను సీఎం పదవి వదులుకుని కాపుల్ని అయినా సీఎం చేస్తానంటూ గోదావరి జిల్లాల టూర్ లో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై ఆసక్తికర చర్చ మొదలైంది.
కాపులకు సీఎం పదవి
రాష్ట్రంలో కేవలం నాలుగైదు శాతం జనాభా కలిగిన రెండు కులాల చేతిలోనే అధికారం ఉండిపోవడంపై చాలా మందిలో అసంతృప్తి ఎప్పటినుంచో ఉంది. గతంలో రాష్ట్రవిభజన తర్వాత టీడీపీ అధికారంలోకి రాగా.. ఆ పార్టీపై కుల ముద్ర వేసి అధికారంలోకి వచ్చిన వైసీపీపైనా ఇప్పుడు అదే ముద్ర పడుతోంది. అంతే కాదు రాష్ట్రంలో కేవలం రెండు కులాల చేతుల్లోనే అధికారం ఉండిపోవడంపైనా మిగతా కులాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా దాదాపు 20 శాతం జనాభా ఉన్న కాపుల్లో ఈ అసంతృప్తి కాస్త ఎక్కువగా ఉంది. దీన్నిగమనించిన విపక్ష నేత చంద్రబాబు తాజాగా గోదావరి జిల్లాల టూర్ లో కాపుల్ని అందలం ఎక్కించేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.ఇందులో వాస్తవం ఎంత ఉన్నా రాష్ట్రంలో వైసీపీని గద్దెదించేందుకు దేనికైనా సిద్ధమని చెబుతున్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ కోసమేనా ?
రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధమంటూ చంద్రబాబు పంపారని చెబుతున్న సంకేతం చూస్తే ఇది పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిందేనా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఎప్పుడూ చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పనిచేస్తారా అన్న వైసీపీ ప్రశ్నకు సమాధానంగా ఈసారి పవన్ ను సీఎం చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చంద్రబాబు సంకేతాలు పంపారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అదే సమయంలో పవన్ కు సీఎం పదవి ఆఫర్ చేసి, టీడీపీ మద్దతిస్తే రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కోసమే ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది.
జనసేనకు వలసలు ఆపేందుకూ..?
అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో పవన్ కు ఆదరణ పెరుగుతుందన్న సంకేతాలున్నాయి. అయితే అది ఆయన్నుసీఎం పదవి వరకూ తీసుకెళ్తుందా లేదా అన్న చర్చ పక్కనబెడితే జనసేనాని వెనుక చంద్రబాబు, బీజేపీ క్యూకడుతున్న పరిస్ధితి. దీంతో జనసేన నేతలు పవన్ కు ఈసారి కీలక పదవి ఖాయమన్న అంచనాల్లో ఉన్నారు. అదే సమయంలో వైసీపీ, టీడీపీలోని కాపు నేతలు కూడా జనసేనలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీకి కాపుల మద్దతు లేకపోయినా నష్టం లేదు. వారికి ప్రత్యర్ధులుగా ఉండే బీసీల మద్దతు ఉంటే చాలు. కానీ టీడీపీకి అలా కాదు. అసలే బీసీలు దూరమైన నేపథ్యంలో కాపుల మద్దతు కూడా తీసుకోలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులుతప్పవు. అందుకే పార్టీలో కాపుల్ని జనసేన వైపు వెళ్లకుండా చూసుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు తక్షణావసరం. అందుకే ఈ కాపు సీఎం పదవి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.