రాజ్యసభ ఎన్నికలు: టీడీపీలో పోటీ పడుతున్న ఆ ‘ముగ్గురు’, తేల్చేసిన వైసీపీ
అమరావతి: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో వాటిపై ఆశలు పెట్టున్న నేతల్లో తీవ్ర ఉత్కంఠ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కగా, వైఎస్సర్సీపీకి ఒక స్థానం దక్కనుంది.
వైఎస్సార్సీపీ ఇప్పటికే తన రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు టీడీపీ తన రెండు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు టీడీపీలో ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మూడు స్థానాలకు మార్చి 23న ఎన్నిక...
రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి మార్చి 23వ తేదీన ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి టీడీపీ తరఫున దేవేందర్గౌడ్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులో తెలంగాణకు చెందిన దేవేందర్గౌడ్కి ఏపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్కు తెలంగాణ ప్రాతినిథ్యం లభించింది.
టీడీపీకి రెండు, వైఎస్సార్సీపీకి ఒకటి...
రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి, వైఎస్సర్సీపీకి ఒక స్థానం దక్కనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ప్రకటించింది. టీడీపీ తనకు వచ్చే రెండు స్థానాలను ఎవరికి కేటాయించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు.
టీడీపీలో పోటీపడుతున్న ముగ్గురు...
టీడీపీలో రెండు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు పోటీ పడుతున్నారు. టీడీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న యనమల తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలంగా చంద్రబాబును కోరుతున్నారు. అయితే అసెంబ్లీ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండే యనమలను రాజ్యసభకు పంపితే తనకు ఇబ్బంది అవుతుందేమో అనేది చంద్రబాబు ఆలోచన.
సీఎం రమేష్కు నో చాన్స్? రేసులో కంభంపాటి, ఆదాల...
ఇక తాను పార్టీకి ఎప్పట్నించో సేవ చేస్తున్నాను కాబట్టి ఈసారి రాజ్యసభకు తనను ఎంపిక చేయాలని కంభంపాటి కోరుతుండగా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనను రాజ్యసభకు పంపాల్సిందేనని ఆదాల ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ తరఫున తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ చంద్రబాబు అందుకు సుముఖంగా లేరని అంటున్నారు.
ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి చాన్స్?
ఈసారి ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వర్ల రామయ్య, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని పార్టీ అధినేత ఎంపిక చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పార్టీయేతరులకూ అవకాశం?
అంతేకాదు, భవిష్యత్తు అవసరాలు, కార్పొరేట్ లాబీయింగ్ కోసం పార్టీయేతర వ్యక్తులకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ కూడా చంద్రబాబు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వేరే పార్టీకి చెందిన వ్యక్తి అయినా, రాజ్యపభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా తన గళం వినిపించగలరనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.