పెదకూరపాడు అసెంబ్లీ బరిలో నారా లోకేష్?
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన మంత్రి నారా లోకేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడ్డారు. శాసన మండలికి ఎన్నికై, అనంతరం తండ్రి కేబినెట్ లో కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ మంత్రిత్వశాఖలను పర్యవేక్షిస్తున్నారు. నారా లోకేష్ వార్డు సభ్యునిగా కూడా గెలవలేరని, దొడ్డిదారిన మంత్రి అయ్యారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు.
వాటికి చెక్ పెట్టడానికి నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం పరిధిలో కమ్మ సామాజిక ఓటు బ్యాంకు బలంగా ఉండటం వల్ల పెదకూరపాడు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది.
కన్నా లక్ష్మీనారాయణకు పెట్టని కోట..
ప్రస్తుతం పెదకూరపాడు స్థానం తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఉంది. ఆ పార్టీ తరఫున కొమ్మాలపాటి శ్రీధర్ వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజానికి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2004ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కన్నా భారీ మెజారిటీతో గెలుస్తూ వచ్చారు.
ఇక్కడ ఆయనకు తిరుగులేదు. 2009 ఎన్నికల్లో ఆయన గుంటూరు వెస్ట్ స్థానం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. కన్నా లక్ష్మీనారాయణ ఖాళీ చేసిన తరువాత పెదకూరపాడు నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా పాతింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ రెండుసార్లూ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై 9,196 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఏ రకంగా చూసినా పెదకూరపాడు నియోజకవర్గం నారా లోకేష్ కోసం సేఫ్ అనే భావిస్తున్నారు పార్టీ నాయకులు.
సీమ నుంచి పోటీ లేనట్టే..
నిజానికి- రాయలసీమలోని ఏదైనా సేఫ్ స్థానం నుంచి నారా లోకేష్ అసెంబ్లీకి పోటీ చేస్తారని భావించారు. కర్నూలు నుంచి పోటీ చేస్తే, తాను తప్పుకొంటానని ఫిరాయింపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు కూడా. దీనితోపాటు నంద్యాల లేదా చంద్రగిరి నుంచి గానీ పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కృష్ణా జిల్లాలోని గుడివాడ కూడా వార్తల్లోకి వచ్చింది.
ఆయా పేర్లేవీ పెద్ద ఎత్తున ప్రచారంలోకి రాలేదు. తాజాగా- పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే సమాచారం చక్కర్లు కొడుతోంది. ఇప్పటిదాకా దీన్ని టీడీపీ నాయకులు ఎవరూ కూడా తోసిపుచ్చట్లేదు. పైగా- రాజధాని అమరావతికి ఆనుకునే ఉండటం కూడా లోకేష్ విజయానికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తే లోకేష్ ఘనవిజయం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.