లక్ష్మీ పార్వతి విషయంలో జగన్ నిర్ణయమేంటి ? ఆమెకు సముచిత స్థానం ఇస్తారా ?
లక్ష్మీ పార్వతి... నందమూరి తారక రామారావు సతీమణి.. వైసిపి నాయకురాలు.. చంద్రబాబు నాయుడు పై నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్న లక్ష్మీపార్వతి గత ఎన్నికల సమయంలో వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. రాత్రనక పగలనక ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించారు. చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబు బండారం బయట పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లక్ష్మీపార్వతి విషయంలో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జగన్ ఓ స్కామ్ స్టార్ .. వాలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అన్న లోకేష్
గత ఎన్నికల సమయంలో వైసీపీ కోసం జోరుగా ప్రచారం చేసిన లక్ష్మీ పార్వతి
గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఆర్కే కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన లక్ష్మీపార్వతి నారా లోకేష్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మనవడా.. మందలగిరి కాదు మంగళగిరి అని సరిగ్గా పలుకు నా ఓటు నీకే అంటూ తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు లక్ష్మీపార్వతి . అంతేకాదు చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఓ చిట్టెలుక ను తెచ్చి సీఎంను చేయాలని ట్రై చేస్తున్నారంటూ చంద్రబాబు పై సెటైర్లు వేశారు. ఎక్కడ వీలైతే అక్కడ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన లక్ష్మీపార్వతికి ఎన్నికల ప్రచార సమయంలో ఊహించని ఆరోపణలు ఎదురయ్యాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరైనా వైసీపీ కోసమే పని చేసిన లక్ష్మీ పార్వతి
లక్ష్మీపార్వతి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తుందని కోటి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. అయితే లక్ష్మీ పార్వతి తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇదంతా టిడిపి చేస్తున్న కుట్రని చాలా ఆవేదనతో ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఆ వ్యక్తి ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశారు. ఆ వ్యవహారంలో లక్ష్మి పార్వతి కి మద్దతుగా పోసాని కృష్ణ మురళి, జీవిత రాజశేఖర్ వంటి వారు కోటి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఎన్నో ఆటుపోట్లను ఓర్చుకుని వైసిపి కోసం పనిచేసిన లక్ష్మి పార్వతి ఇప్పుడు జగన్ ఎలాంటి స్థానం ఇవ్వబోతున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.
జగన్ సముచిత స్థానం ఇస్తారా ? జగన్ మనసులో ఏముంది ..
ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు దాదాపుగా భర్తీ చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీలో మహిళల నుండి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ గా, వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించారు. ఇక లక్ష్మి పార్వతి విషయంలో జగన్ ఆలోచనలో ఏముంది అనేది ఇప్పటి వరకు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే మంత్రివర్గంలో స్థానం దక్కేది అన్న భావన చాలామంది నాయకులలో ఉంది. కానీ ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించలేదు. అలాగే జగన్ కూడా ఆమెని ఎమ్మెల్యేగా పోటీలో దించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. మరి ఇప్పుడైనా జగన్ ఆమెకు సముచిత స్థానం ఇస్తారని , ఎమ్మెల్సీ గాని, ఏదైనా నామినేటెడ్ పదవి లో గాని ఆమెకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ లక్ష్మీ పార్వతి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో...