అభిమానులు హత్యాయత్నం చేస్తారా?...నిజా నిజాలు బయట పెట్టాలి: వైసిపి నేత బొత్స సత్యనారాయణ
అమరావతి:జగన్ పై దాడి చేసింది అతడి అభిమానేనంటూ టిడిపి నేతలు చేస్తున్న ప్రచారంపై వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభిమానులైతే కాళ్లకు దండాలు పెడతారు...లేదంటే దండలు వేసి అభిమానం చాటుకుంటారు...అలా గాకుండా అభిమానులు ఎక్కడైనా హత్యాయత్నం చేస్తారా అని బొత్స సత్యనారాయణ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమాని అని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నిజానిజాలు...ప్రభుత్వం బైటపెట్టాలి
జగన్ దాడి వెనుక నిజా నిజాలు...అసలు వాస్తవాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ఇది...ప్రభుత్వ వైఫల్యం
వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదని, ఇది పూర్తిగా ప్రభుత్వ భద్రతా వైఫల్యమని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేతకే భద్రత కల్పించలేని ప్రభుత్వం, సామాన్యుడికి ఎలా రక్షణ కల్పిస్తుందని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు...స్పందించారు
అయితే జగన్ పై దాడిపై సిఎం చంద్రబాబు స్పందించకపోవటం బాధ్యతారాహిత్యమని వైసిపి నేత బొత్స సత్యనారాయణ విమర్శించగా మరోవైపు జగన్ దాడిని సిఎం చంద్రబాబు ఖండించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేని విషయమని చంద్రబాబు అన్నారు. ఈ ఘటనను అడ్డంపెట్టుకొని అల్లర్లకు దిగితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
వైసిపి కార్యకర్తల...ధర్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలకు దిగారు . పలుచోట్ల భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న అభిమానులు, కార్యకర్తలు ధర్నాలతో, రాస్తారోకోలతో నిరసన తెలుపుతున్నారు. వై.ఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా వైసిపి ఆధ్వర్యంలో పుంగనూరు ఇందిరా సర్కిల్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ మా నేత జగన్ మోహన్ రెడ్డి పై దాడి చేయించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. సిఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.