మాజీ అదనపు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ సభ టికెట్? నయీంతో లింకులు ఉన్నాయా?
నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు ఊపందుకుంది. కడప, రాజంపేట, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే పలువురు నాయకుల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల పాత ముఖాలు, మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల లోక్ సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డికి ఈ సారి టికెట్ దక్కే అవకాశాలు లేవు. ఈ సారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి పట్టుబట్టారు. అయినప్పటికీ.. అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నందికొట్కూరుకు చెందిన సీనియర్ నాయకుడు మాండ్ర శివానంద రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
ఎవరీ మాండ్ర శివానంద రెడ్డి?
మాండ్ర శివానంద రెడ్డి మరెవరో కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి వరుసకు సోదరుడు అవుతారు. గౌరు చరితా రెడ్డి భర్త, గౌరు వెంకట రెడ్డికి మాండ్ర శివానంద రెడ్డి స్వయానా బావ. మాజీ పోలీస్ అధికారి. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. అదనపు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పని చేస్తున్నప్పుడు గ్యాంగ్ స్టర్ నయీంతో సన్నిహితంగా మెలిగినట్లు చెబుతున్నారు.
దీనికి సంబంధించి, అన్ని ప్రధాన దినపత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. పత్రికాముఖంగా ఆయన ఈ విమర్శలను తోసిపుచ్చారు కూడా. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం వల్ల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ మాండ్ర శివానంద రెడ్డిపై విమర్శలు వచ్చాయి. `నీరు-చెట్టు`, ఇసుక దంధాల్లో ఆయన ఆరితేరిపోయారని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ.. పార్టీ కోసం కృషి చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ సారి నంద్యాల లోక్ సభ టికెట్ ను మాండ్రకే కేటాయిస్తారని అంటున్నారు పార్టీ నేతలు.
గౌరు చరిత ఫిరాయింపు వెనుక మాండ్ర
పాణ్యం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గౌరు చరితా రెడ్డి పార్టీ ఫిరాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరితే పాణ్యం టికెట్ ఆమెకే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక మాండ్ర శివానంద రెడ్డి హస్తం ఉందని చెబుతున్నారు. మాండ్ర ఒత్తిడి మేరకే ఆమె టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారట. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొద్దిరోజుల కిందట వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సారి పాణ్యం టికెట్ కాటసాని దక్కుతుందనే టాక్ ఉంది.
నిజానికి- కాటసానికి పక్కనే ఉన్నబనగాన పల్లె నుంచి పోటీ చేయించాలనేది వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం ఆలోచన. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి ఓడిపోయారు. దీనితో- అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకుంది. ఆ ఉద్దేశంతోనే రాంభూపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంది. దీనికి భిన్నంగా.. చరితా రెడ్డి పార్టీని వీడటానికి రెడీ అయ్యారు. ఆమె పార్టీ నుంచి వెళ్లిపోతే..వైఎస్ఆర్ సీపీ టికెట్ రాంభూపాల్ రెడ్డిదే అవుతుంది. దీనికంతటికీ కారణం.. మాండ్ర శివానంద రెడ్డి చక్రం తిప్పడమేనని అంటున్నారు.
ఫిరాయింపులకు మొండిచెయ్యేనా?
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డి సహా ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి (కర్నూలు), మణి గాంధీ (కోడుమూరు)లకు ద్వారాలు దాదాపు మూసుకుపోయినట్టే. కర్నూలు టికెట్ కోసం టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ సహా మరో ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. భరత్కు టికెట్ దాదాపు ఖాయం అవుతుందనే అంటున్నారు. పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఆదోనీ నుంచి అసెంబ్లీ బరిలో దింపబోతున్నట్లు సమాచారం ఉంది. ఈ నెల 28న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నందున.. ఆయన కోసం కర్నూలు లోక్ సభతో పాటు డోన్ అసెంబ్లీ టికెట్ను రిజర్వ్ చేసి ఉంచారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డికి శ్రీశైలం టికెట్ ఖాయమైంది.