చంద్రబాబు నివాసానికి వరదముప్పు పొంచివుందా? కృష్ణానది వరద ప్రవాహం మరింత పెరిగితే పరిస్థితేంటీ?
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి వరదముప్పు పొంచివుందా? గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కరకట్ట మార్గానికి సమీపంలో.. కృష్ణానది ఒడ్డుకు ఆనుకుని నిర్మించిన ఆ నివాసం వరదపోటుకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తేసిన నేపథ్యంలో.. వరద నీరు పోటెత్తుతోంది. దిగువకు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే- చంద్రబాబు నివాసానికి ముప్పు తప్పదని అంటున్నారు పర్యావరణ వేత్తలు. శ్రీశైలం నుంచి పులిచింతల దాకా కృష్ణానదిపై నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్న నేపథ్యంలో- నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
కృష్ణా బఫర్ జోన్ పరిధిలో నివాసం..
తొలుత శ్రీశైలం, ఆ తరువాత నాాగార్జున సాగర్, తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేట్లను ఎత్తేశారు. సుమారు 4,25,873 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్స్ సమీపంలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సుమారు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అదే నివాసం ఉన్నారు. భారతీయ జనతాపార్టీ నేత, లోక్ సభ మాజీ సభ్యుడు గోకరాజు రంగరాజుకు సంబంధించిన అతిథిగృహం అది. కృష్ణా నది బఫర్ జోన్ పరిధిలో దాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
అయిదేళ్లుగా అక్కడే..
కృష్ణానదికి భారీగా ప్రవాహం సంభవిస్తే.. వరద నీరు బఫర్ జోన్ ను ముంచేస్తోంది. సరిగ్గా అలాంటి ప్రాంతంలోనే ఈ అతిథిగృహాన్ని నిర్మించారు. ఈ భవనం అక్రమ కట్టడమని, దాన్ని తొలగించాలని ఆదేశిస్తూ, 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలిరోజుల్లోనే నోటీసులను జారీ చేయడం, ఆ తరువాత ఆయన అదే భవనాన్ని తన నివాసంగా మార్చుకోవడం తెలిసిందే. తాజాగా- కృష్ణానది భారీ నుంచి అతిభారీ వరద నీటితో ఉరకలు వేస్తోంది. 2009 తరువాత ఏనాడూ కనీస స్థాయిలో కృష్ణానదికి వరద సంభవించలేదు. పదేళ్ల తరువాత భారీ వరదను సంతరించుకుంది కృష్ణమ్మ. ఇన్నేళ్ల జాప్యాన్ని, లోటును భర్తీ చేసేలా కదం తొక్కుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లను దాటుకుని ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది.
వరద తీవ్రత మరింత పెరిగితే..
ప్రస్తుతం కొనసాగుతున్న వరద ప్రవాహ తీవ్రత ఇదే స్థాయిలో ఉంటే చంద్రబాబు నివాసానికి ముప్పు తప్పకపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో దాన్ని నిర్మించారని, వరద తీవత్ర మరింత పెరిగితే- ముప్పు తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తేయడంతో కృష్ణాజలాలు ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా- ఇన్నాళ్లూ వట్టిపోయి కనిపించిన పులిచింతల జలకళను సంతరించుకుంది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 45.77 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి మూడు నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుోంది. ఫలితంగా గేట్లను ఎత్తివేశారు అధికారులు. అవుట్ఫ్లో 14,596 క్యూసెక్కులుగా ఉంది. ఈ నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. ఈ బ్యారేజీ నిండితే.. ఇక కృష్ణా జలాలు కలిసేది బంగాళాఖతాంలోనే.