'నోబెల్' సాధిస్తే.. 100కోట్లు..: ఏపీ శాస్త్రవేత్తలకు సీఎం బంపర్ ఆఫర్
ఏపీకి చెందిన శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ అవార్డును సాధించగలిగితే.. వారికి ప్రభుత్వం తరుపున రూ.100కోట్లు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తిరుపతి: శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఏపీకి చెందిన శాస్త్రవేత్తలెవరైనా నోబెల్ అవార్డును సాధించగలిగితే.. వారికి ప్రభుత్వం తరుపున రూ.100కోట్లు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరుగుతోన్న బాలల కాంగ్రెస్కు సీఎం హాజరైన సీఎం.. యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్క ఐడియా మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేయగలదని, ఆవిధంగా భవిష్యత్తులో శాస్త్ర-సాంకేతిక పురోగతి సాధించడానికి యువతనే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
సైన్స్ కు సాంకేతికతను జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, నూతన ఆవిష్కరణలకు యువత నాంది పలకాలని సీఎం సూచించారు.సృజనాత్మకంగా ఆలోచించడం అలవరుచుకోవాలని, ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదని అభిప్రాయపడ్డారు.
కాగా, మంగళవారం నాడు 104వ సైన్స్ కాంగ్రెస్ లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. మోడీ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయంటూ సీఎం ప్రధాని మోడీని అభినందించారు.