జనసైనికులు తట్టుకుని నిలబడగలరా అనుకున్నా.. కానీ మార్పు మొదలైంది.. గెలిచిన గ్రామాల్లో కేరళ మోడల్...
రాష్ట్రంలో 1209 మంది సర్పంచ్లు,1776 మంది ఉపసర్పంచ్లు,4456 మంది వార్డు సభ్యులు జనసేన మద్దతుతో గెలవడం సంతోషంగా ఉందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాష్ట్రంలోని 65శాతం పంచాయతీల్లో జనసేన మద్దతునిచ్చిన అభ్యర్థులు ద్వితీయ స్థానంలో నిలవడం మార్పుకు సంకేతమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులకు మొత్తంగా 27శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. జనసేన మద్దతుదారులు గెలుపొందినచోట్ల కేరళ తరహాలో పంచాయతీలను అభివృద్ది చేస్తామన్నారు.
పంచాయతీ వ్యవస్థ సవ్యంగా పనిచేస్తోందా అనిపించింది...
'తిత్లీ తుపాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెల్లో పర్యటించాను. పంచాయతీల పరిస్థితులను స్వయంగా చేశాను. తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు లేవు.ఉద్దానంలో కిడ్నీ వ్యాధికి భయపడి ప్రజలు వలసలు వెళ్లిపోవడం,విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామ ప్రజలు బోధకాలు సమస్యతో బాధపడుతుండటం.... ఇవన్నీ చూసి అసలు పంచాయతీ వ్యవస్థ సవ్యంగా పనిచేస్తోందా అనిపించింది.
కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఆ నిధులు ప్రభుత్వాలను దాటి ప్రజలకు చేరినట్లు... సత్ఫలితాలు వచ్చినట్లు ఎక్కడా కనిపించట్లేదు.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రతీ గ్రామంలో జనసైనికులు
నాయకులు చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతన లేదని పవన్ కల్యాణ్ అన్నారు. పల్లెలపై ఒకటి,రెండు వర్గాలు ఆధిపత్యం చెలాయించడమే ఇందుకు కారణమని చెప్పారు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే కొద్ది కుటుంబాల ఆధిపత్యంలో గ్రామాలు నలిగిపోయాయని అన్నారు. జనసేన పోరాట యాత్ర సమయంలో తాను రాష్ట్రమంతా పర్యటించానని పవన్ గుర్తుచేశారు. జనసేన పార్టీలో నాయకులు ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ... జనసైనికులు లేని గ్రామం మాత్రం లేదన్నారు.
తట్టుకుని నిలబడగలరా అనుకున్నా...
నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల కంటే గ్రామాల్లో జరిగే ఎన్నికల పోరు చాలా కష్టసాధ్యమైనదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల పరంగా గ్రామాలు చీలిపోతాయని... అలాంటి పరిస్థితులను జనసైనికులు ఎంతవరకు తట్టుకుని నిలబడగలరు అని అనుకునేవాడినని చెప్పారు. 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించినప్పుడు... కొత్త నాయకత్వం రావాలి,అది కూడా గ్రామాల నుంచే రావాలని భావించామన్నారు. ఏదేమైనా ఈ విజయం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు.
మార్పుకు సంకేతమన్న పవన్...
జనసేన విజయానికి కారణం పిడుగుల్లాంటి జనసైనికులే అని పవన్ అన్నారు. కుల రాజకీయాలకు,అవినీతి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన ఆడపడుచుల విజయమన్నారు. డబ్బుతో కాకుండా ఉన్నత ఆశయాలతో రాజకీయం చేయాలనుకునే అభ్యుదయవాదుల విజయం ఇది అన్నారు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా పంచకుండా,దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల్లో జనసైనికులు గెలిచారన్నారు. జనసేన విజయం మార్పుకు సంకేతమని అభిప్రాయపడ్డారు.