బుట్టా రేణుకకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా ? ఆశగా ఎదురు చూస్తున్న మాజీ ఎంపీ
కర్నూలు జిల్లా కీలకనేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారా? వైసిపి పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్న జగన్ బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యురాలిగా కానీ అవకాశం ఇస్తారా? ఒకప్పుడు వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరి,తిరిగి టీడీపీని వీడి వైసీపీలో చేరిన బుట్టా రేణుక ప్రస్తుతం ఏ పదవి లేకుండా ఆశగా ఎదురు చూస్తున్న వేళ జగన్ తీసుకోబోయే నిర్ణయం బుట్టా రేణుకకు కలిసొస్తుందా? అన్నది ఇప్పుడు పార్టీలో సాగుతున్న ఆసక్తికర చర్చ.
బుట్టా పై బెట్టు..! ప్రచారానికి ఒద్దన్న ఎమ్మిగనూరు అభ్యర్థి..! ఎదురు తిరిగిన చేనేత కార్మికులు..!!
గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి సొంత గూటికి చేరిన బుట్టా రేణుక
కర్నూలు జిల్లాలో అందరికీ సుపరిచితమైన నేత బుట్టా రేణుక. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ టికెట్ పై కర్నూలు జిల్లా నుంచి ఎంపీ సీట్లు గెలుచుకున్న బుట్టా రేణుక, ఆ తర్వాత అనూహ్యంగా టిడిపిలో చేరారు. గత ప్రభుత్వ హయాంలో టిడిపిలో కొనసాగిన రేణుకకు 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టిడిపి నుండి ఆమెకు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వకపోవడంతో, తీవ్ర మనస్థాపం చెందిన బుట్టా రేణుక, ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వైయస్ఆర్సిపి గూటికి చేరుకుంది. తాను తప్పు చేశానని, అందుకే శిక్ష అనుభవించాలని బాహాటంగానే చెప్పి జగన్ కు సారీ చెప్పారు బుట్టా రేణుక.
కర్నూలు జిల్లాలో పార్టీ కోసం విశేషంగా పని చేసిన రేణుక
ఇక గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన బుట్టారేణుక పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. ప్రచారంలో జోరు గా పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా చూపించటంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు సీఎం జగన్ తనకు ఏదైనా అవకాశం ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు బుట్టారేణుక. అయితే రాబోయే మార్చిలో గవర్నర్ కోటాలో ఇద్దరు మహిళలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గానీ, రాజ్యసభ సీటు గానీ ఇస్తారని ప్రచారం
ఒక బీసీ మహిళకు, ఒక ఎస్సీ మహిళకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారని పార్టీల ప్రచారం జరుగుతుంది. దీంతో వైసిపి తరపున బీసీ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కు దక్కే అవకాశం ఉందని కర్నూలు జిల్లాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఒకవేళ ఎమ్మెల్సీ కాకుంటే బుట్ట రేణుక రాజ్యసభ సభ్యురాలిగా అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా ? వేచి చూస్తున్న రేణుక
ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీ కోసం కీలకంగా పనిచేసిన బుట్టా రేణుక, అటు పార్టీ కార్యకర్తలతో పాటు తమ బిజినెస్ ను కూడా చూసుకుంటూ సీఎం జగన్ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని మెరీడియన్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. అధినేత నిర్ణయం కోసం సైలెంట్ గా వేచి చూస్తున్నారు.ఇక బుట్టా రేణుక కు ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కానీ ఇస్తారని వై వి సుబ్బారెడ్డి వంటి నేతలు ఆమెకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి బుట్ట రేణుక కు ఆ బంపర్ ఆఫర్ ఇస్తారా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.