పవన్తో జగన్ జతకడతాడా...? ఏపీ రిజల్ట్ ఎలా ఉండబోతోంది..?
Recommended Video
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరి రాజకీయం వారు చేస్తూ నేతలు ముందుకు వెళుతున్నారు. అప్పటి వరకు ప్రత్యేక హోదా సంజీవనా అంటూ ప్రశ్నించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆ తదనతరం జరిగిన పరిణామాలతో ప్రత్యేక హోదా నినాదాన్ని పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొచ్చారు. ఇక ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళుతూ తన రాజకీయం తాను ప్రదర్శిస్తున్నాడు.
వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇది టీడీపీ విజయంగా చెప్పుకునేందుకు ఆ జిల్లా నేతలు సీఎం రమేష్, బీటెక్ రవిలు దీక్షకు దిగి తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రానున్న 2019 ఎన్నికల్లో కీలకం కానున్నారు.
2019 ఎన్నికల్లో కీలకం కానున్న ఉభయగోదావరి జిల్లాలు
2014 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి షాకిచ్చే ఫలితాలు వచ్చాయి. మరి ఈసారి ఈ రెండు జిల్లాల్లో జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనేదే హాట్ టాపిక్గా మారింది. జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందనే వస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఓట్లు రాల్చగలవా అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఆ మధ్య తిరుపతి తాజా మాజీ ఎంపీ వరప్రసాద్... పవన్ కళ్యాణ్ వైసీపీకే మద్దతు పలుకుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ పలు వర్గాల వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఆయా వర్గాల వారికి హామీలు ఇస్తూ వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన పోరాట యాత్రలతో ప్రజల్లోకి వెళుతున్నారు.
పవన్తో జగన్ జతకడితే టీడీపీ అడ్రస్ గల్లంతేనా..?
ఇక వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్, జగన్లు జతకడితే గోదావరి జిల్లాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జగన్ పవన్తో జతకడతారా అనేది చాలామందిని తొలుస్తున్న ప్రశ్న. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో జతకట్టడంతోనే రెండు గోదావరి జిల్లాల్లో సైకిల్ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయనే భావన పొలటికల్ అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. మరి అంత కీలకంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో జగన్ ఏ మంత్రం వేసి అక్కడి ఓటర్లను ఆకట్టుకుంటారనే ప్రశ్న ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎవరి దారి వారిదే కావడంతో రెండు జిల్లాలు పవన్కే మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. రెండు జిల్లాలోని కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పవన్ చెప్పడంతోనే టీడీపీకి ఓట్లు వేసినట్లు బాహాటంగానే చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కాపు సామాజిక వర్గం ఈ సారి ఎవరికి ఓటు వేస్తే అక్కడ వారిదే గెలుపు అన్న ప్రచారం ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కాపు రిజర్వేషన్లపై టీడీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి బంతిని కేంద్రం కోర్టులో వేసింది. ఇక కమ్మ సామాజిక వర్గం ఎటూ టీడీపీ వైపే ఉంది.
గోదావరి జిల్లాల్లో కాపులు ఎటువైపు..?
రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా బీసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన వైయస్ జగన్... ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చే సరికి అక్కడ ఆత్మీయ సభలుకానీ సమావేశాలు కానీ నిర్వహించలేదని... ఒకవేళ అలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాపు ఓటు బ్యాంకుపై ఆ ప్రభావం పడుతుందనే కారణంతోనే జగన్ ఆచితూచి అడుగువేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయాన్ని అందుకోవాలంటే ఎలాంటి అవకాశాన్నైనా ఒడిసి పట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు జిల్లాలు కీలకం కానున్న నేపథ్యంలో జగన్... పవన్తో జతకడితేనే గట్టెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు అనంతపురం జిల్లాల్లో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. అనంతపురం జిల్లాలో బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో కూడా ప్రజలు టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే జగన్కు అన్ని విధాలా మేలు జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
చంద్రబాబు రాజకీయం ముందు జగన్ సక్సెస్ అవుతారా...?
ఏది ఏమైనప్పటికీ... వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయం ముందు నిలబడాలంటే జగన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 2014లో టీడీపీ ఘోర ఓటమి చవిచూస్తుందని ప్రతీ సర్వే చెప్పినప్పటికీ.... చంద్రబాబు రాజకీయం ముందు అన్నీ సర్వేలు నిలవలేకపోయాయని వారు గుర్తు చేస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు ఏఒక్క అవకాశాన్ని వదులుకోలేదని వారు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను జగన్ ఇంప్లిమెంట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.