కేసీఆర్ తరహాలో జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా ? రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తారా ?
తెలంగాణా సీఎం కేసీఆర్ తరహాలో సీఎం జగన్ రెవెన్యు శాఖ ప్రక్షాళనకు పూనుకుంటారా ? సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్న తరుణంలో అటు ఏపీలోనూ రెవెన్యూ శాఖలో వేళ్ళూనుకున్న అవినీతి గురించి ఆసక్తికర చర్చ సాగుతుంది . ఏపీలో ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో సాగిన భూదందాలో రెవెన్యు అధికారులు భారీగానే చేతి వాటం చూపించారు. అలాగే విశాఖ భూ కుంభ కోణంలోనూ అధికారుల పాత్ర ఉంది.
టీడీపీ హయాంలో రెవెన్యూ శాఖలో అవినీతి .. చుక్కల భూముల వ్యవహారంలోనూ దోపిడీ
రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు తెలంగాణా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేసే అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలువస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో ఏపీలో సీఎం జగన్ కూడా శాఖల వారీగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖ ,వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలపై దృష్టి పెట్టిన జగన్ రెవెన్యూ శాఖపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి కంపు కొడుతున్న రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాలన చెయ్యాలని ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. గత ప్రభుత్వ హయాంలో చుక్కల భూముల వ్యవహారంలోనూ రెవెన్యూ ఉద్యోగులు ప్రజలను బాగానే దోచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద వ్యతిరేఖత రావటానికి అధికారుల అవినీతి, దోపిడీ కారణం అని చెప్పొచ్చు. ఇక ఈ సమయంలో జగన్ కు అట్టం కట్టిన ప్రజలు అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారు.
వీఆర్ఓ వ్యవస్థ రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ... జగన్ కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తారా
అవినీతిని అరికట్టడానికి తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు గ్రామ స్థాయి నుండే రెవెన్యూ శాఖను పునరుద్ధరించాలని చూస్తున్నారు . వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను పంచాయతీ రాజ్ లేదా వ్యవసాయ శాఖలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు .రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సూచనలను సీఎం కెసిఆర్ అధికారులకు సూచించారు. ఇప్పుడు కొత్త భూ చట్టం తీసుకురావటానికి కసరత్తు జరుగుతోంది. దీంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన కూడా చెయ్యాలని చూస్తున్నారు. ఇక ఇదే తరహాలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం జగన్ కూడా నిర్ణయం తీసుకుంటారా అంటే .. జగన్ సర్కార్ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చెయ్యాలనే ఆలోచనలో ఉంది అన్న వార్త ఇప్పుడు ఏపీలో చర్చకు కారణం అవుతుంది.
కేసీఆర్ తరహా కొత్త భూ చట్టాన్ని జగన్ తీసుకు వస్తారా ?
రెవెన్యూ అధికారుల ,వీర్వోల సహాకారంతో తెలుగురాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఇబ్బడి ముబ్బడిగా భూ దందా చేశారు. ఇళ్లకు రప్పించుకుని మరీ రిజిస్ట్రేషన్లు మార్చి భూ కబ్జాలకు పాల్పడిన కుంభకోణాలు అట్టుడికిస్తున్నాయి. హైదరాబాద్- విజయవాడ- వైజాగ్- తిరుపతి సహా పలు నగరాల్లో ఈ దందాలు మరీ తీవ్రంగా ఉన్నాయి. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు సైతం కైంకర్యం అయిపోయాయి. ఇక వీటిని కబంధ హస్తాల నుండి కాపాడటమే కాకుండా ముందు అవినీతి మయంగా మారిన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. ఇక జగన్ కూడా ఏపీలో భూ కుంభకోణాలపై చాలా సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా సీఎం కేసీఆర్ తరహా కొత్త భూచట్టాన్ని తీసుకురావాలని , రెవెన్యూ ప్రక్షాళనకు రంగంలోకి దిగాలని ప్రజలు భావిస్తున్నారు. జగన్ సైతం ఆదిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.