జైలుకైనా వెళ్తా!: కావలి ఎమ్మెల్యేపై 'కేసు' టిడిపికి ఆయుధమా?
కావలి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆయన ఖండించారు కూడా. అయితే, ఆయన సన్నిహితులతో తన ఆవేదన వెల్లబోసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల పలువురు వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా టిడిపిలో చేరుతారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. తన పైన ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, తాను ఎట్టి పరిస్థితుల్లోను టిడిపిలో చేరనని చెప్పారు.
ముహుర్తం కుదిరింది: 18న వైసీపీ నుంచి టీడీపీలోకి కావలి ఎమ్మెల్యే?
అయితే, తనను టిడిపిలో చేరాలని ఆ పార్టీ బ్లాక్ మెయిల్ చేస్తోందని, పార్టీలో చేరితే వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తామని చెబుతున్నారని, చేరకపోతే చీఫ్ లిక్కర్ కేసును తెరమీదకు తెస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, జైలుకు పంపిస్తామని టిడిపి నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే, జైలుకైనా వెళ్తాను కానీ టిడిపిలో మాత్రం చేరనని చెబుతున్నారు.
విషయానికి వస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని లొంగదీసుకునేందుకు గతంలోని ఓ కేసును టిడిపి నేతలు ఆయుధంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది రామిరెడ్డి వర్గం వాదనగా ఉందని తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కావలి నియోజకవర్గం పరిధిలో చీప్ లిక్కర్ పంపకాలు జరిగాయి. దానిని తాగిన కొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఒకటి రెండు మరణాలు కూడా సంభవించాయి. కేసులో దర్యాఫ్తులో ఉండగా టిడిపి అధికారంలోకి వచ్చింది.
ప్రతిపక్ష ఎమ్మెల్యే రామిరెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకొని ఆయనను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, రామిరెడ్డి కూడా కొన్ని కారణాలతో టిడిపితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఆయన వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు కూడా ఉన్నాయి.