ఎన్డీఏ 250 సీట్ల దగ్గర ఆగిపోయి ఉండాల్సింది..ఇన్ని రావనుకున్నా! అయినా వదిలి పెట్టను!
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఎన్డీఏ మెజారిటీ 250 స్థానాలకు దగ్గరగా వచ్చి ఆగిపోయి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే.. తాము మద్దతు ఇస్తామని షరతు విధించి ఉండేవాడినని, ఇప్పుడు ఆ అవకాశం చేజారినట్టే కనిపిస్తోందని చెప్పారు.
వైఎస్ జగన్ ఆదివారం దేశ రాజధానిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు. తాను ఒకటి తలిస్తే.. దేవుడు ఇంకొకటి తలచాడని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏకు తమ పార్టీ మద్దతు అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడాలని తాను కోరుకున్నానని చెప్పారు.
రామ్గోపాల్ వర్మ కొత్త చిత్రం! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వైఎస్ జగన్కు తలనొప్పేనా?
ఎన్డీఏ 250 సీట్ల దగ్గర ఆగిపోయి ఉంటే- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ సంతకం చేసిన తరువాతే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేసే పరిస్థితులు వస్తాయని ఆశించానని అన్నారు. దీనికి భిన్నంగా బీజేపీకి, ఎన్డీఏకు భారీ మెజారిటీ లభించిందని అన్నారు. అయినప్పటికీ తాను వదిలి పెట్టే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మాట ఇచ్చిన తరువాత వెనుదిరగబోనని చెప్పారు. 30 సార్లు కావచ్చు 40 సార్లు కావచ్చు, 50 సార్లు కావచ్చు.. ప్రధాన మంత్రిని కలిసినప్పుడల్లా హోదా కోసం అడుగుతూనే ఉంటాను. హోదా ఇవ్వమని అడుగుతూనే ఉంటాను.. అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.