జగన్ ఇలాకాలో టీడీపీకి షాక్!: ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతున్నారా, ఏం జరిగిందంటే?
కడప: తమ పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ఆదివారం నాడు ఆరోపించారు. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసి తన బాధను వివరిస్తానని చెప్పారు. పార్టీకి తనను దూరం చేసేందుకే ఆదినారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారని చెప్పారు.
జగన్పై ఎందుకు దాడి చేశానో చెబుతా: నిందితుడు, జైల్లో రాసిన పుస్తకంలో కీలక అంశాలు
తనను ఆహ్వానించకుండా సమావేశం నిర్వహించారని, ఇది సరికాదని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తన పైన అనవసరమైన అభాండాలు వేస్తున్నారని చెప్పారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే?
అంతకుముందు, కడప జిల్లా రాజంపేట టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజంపేట నేత మేడా మల్లికార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగింది. దీంతో నష్ట నివారణ చర్యల కోసం ఆదినారాయణ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి మేడా మల్లికార్జున రెడ్డికి ఆహ్వానం అందలేదు.
మేడా వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రచారం
మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరుతున్నారని వార్తలు రావడంతో ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి సందడి కనిపించింది. ఈ ప్రచారంపై ఆయన తన వర్గీయులతోను భేటీ అయ్యారు. ఆదినారాయణ రెడ్డితో జరిగే భేటీలో ఆయనను నిలదీయాలను కూడా తన వర్గీయులకు మేడా సూచించారు. మేడా పార్టీ మార్పు ప్రచారంపై టీడీపీ అధిష్టానం కూడా సీరియస్గానే ఉందట.
ఆదినారాయణ రెడ్డి ఏమన్నారంటే
ఎమ్మెల్యే మేడా పార్టీ మారుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తలను ఖండించాలని పదేపదే కోరినా ఆయన స్పందించలేదని మంత్రి ఆదినారాయణ రెడ్డి వేరుగా అన్నారు. అందుకే ఆయనను సమావేశానికి ఆహ్వానించకుండా భేటీ అయినట్లు తెలిపారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు పిలిచినా ఆయన అమరావతికి రాలేదని, మేడా మల్లికార్జున రెడ్డి లాంటి వాళ్లు పార్టీ మారినా టీడీపీకి నష్టం లేదన్నారు.