టిడిపిలో దగ్గుబాటి ఫ్లెక్సీకలకలం: మోత్కుపల్లి కొత్తపార్టీ?
పర్చూరు/హైదరాబాద్: ప్రకాశం జిల్లా పర్చూరులో ఫ్లెక్సీల కలకలం ఏర్పడింది. జిల్లాకు చెందిన సీనియర్ శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావును టిడిపిలోకి ఆహ్వానిస్తూ పర్చూరు నియోజకవర్గంలో పలు ఫ్లెక్సీలు వెళిసాయి. వాటిపై కాంగ్రెసు, టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత టిడిపి నేతలు ఆ ఫ్లెక్సీలను తొలగించారు.
మోత్కుపల్లి మంతనాలు
మరోవైపు రాజ్యసభకు తనను ఎంపిక చేయక పోవడంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. తన వర్గంతో మంతనాలు జరుపుతున్న మోత్కుపల్లి ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. పార్టీని వీడుతారా అనే చర్చ జరుగుతోంది. ఆయన పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాకాకుండా కాంగ్రెసు పార్టీ వైపు కూడా చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
కాగా, అలిగిన మోత్కుపల్లిని బుజ్జగించేందుకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మోత్కుపల్లిని బుజ్జగించేందుకు ఆయన నివాసానికి ఎర్రబెల్లి దయాకర రావు నేతృత్వంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను అధినేత పంపించారు. సుజనా చౌదరి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు ఆయనను బుజ్జగిస్తున్నారు. అయితే, ఆయన బుజ్జగింపులకు తగ్గే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.
కాగా, చంద్రబాబు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూర్చితే తప్ప పదవులు రావని పొన్నం ఆరోపించారు. టిటిడిపి నేతలకు దమ్ము, పౌరుషం ఉంటే బాబు సూచించిన అభ్యర్థులకు ఓటు వేయవద్దన్నారు.