ముద్రగడ యూ టర్న్!: కాపు 'క్రెడిట్' షాక్, జగన్కు చేయిచ్చినట్లేనా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం షాక్ ఇస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారనే వాదన ఉంది.
ముద్రగడ కాపు ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. బిజెపి నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే ముద్రగడ ఉద్యమానికి ప్రధానంగా జగన్ కారణమే వాదనలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు 'హీరో' అయిన ముద్రగడ... జగన్కు షాకిస్తారా అనే చర్చ సాగుతోంది.
నో వర్రీ: జగన్ దీక్షకు మాదరిగానే ముద్రగడ దీక్ష కూడా?
కాపు ఉద్యమం కారణంగా ముద్రగడ ఆ సామాజిక వర్గంలో ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఇప్పుడు మెజార్టీ కాపులకు ఆయన చెప్పిందే వేదంగా ఉందని చెప్పవచ్చు. గతంలో చిరంజీవి వైపు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు చూసిన కాపులు... ఇప్పుడు ముద్రగడ వైపు చూస్తున్నారని చెప్పవచ్చు.
ఇప్పుడు కాపులకు హీరో అయిన ఆయన తన ఉద్యమం వెనుక ఎవరూ లేరని, ఏ పార్టీకి వ్యతిరేకం, ఏ పార్టీకి అనుకూలం కాదని చెప్పారు. క్రెడిట్ మొత్తం ముద్రగడకు వెళ్లిపోతుంది. దీనిని కొందరు వైసిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, గురువారం నాడు ముద్రగడ వ్యాఖ్యలు కూడా జగన్కు షాకిచ్చేలా ఉన్నాయని అంటున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో ముద్రగడ 5వ తేదీ నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయనతో కొందరు టిడిపి నేతలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఆయన గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. తన డిమాండ్లకు అంగీకరిస్తే తాను ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాపుల కోసం వేసిన బీసీ కమిషన్ను కుదించాలని, ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున.. రెండేళ్లకు రూ.2వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంతో చర్చలకు తాను సిద్ధమని, ప్రతినిధులు వస్తే చర్చిస్తామని, రిజర్వేషన్ల కోసమే తమ ప్రయత్నమని, చర్చల్లో నా జాతికి న్యాయం జరుగుతుందని అనిపిస్తే ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం ఆయన ప్రతిపాదనలకు అంగీకరిస్తే.. ముద్రగడ దీక్షపై తగ్గితే, అది జగన్కు షాకేనని అంటున్నారు.