ఎప్పుడో రంగంలోకి దిగారు!: మురళీ మోహన్ రాజకీయ వారసులు ఆమెనా?
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ నేత, రాజమండ్రి లోకసభ సభ్యులు మురళీ మోహన్ కోడలు రూప నియోజకవర్గంలో తన మామ లేని లోటును తీర్చుతున్నారట. గత పదేళ్లుగా ఈ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు చేరువయ్యారు.
2014 ఎన్నికల్లో మురళీ మోహన్ గెలిచారు. ప్రస్తుతం ఆయన అధికారిక కార్యకలాపాల కారణంగా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండేందుకు వీలుపడటం లేదని అంటున్నారు. అంతేకాకుండా రెండేళ్ల క్రితం మోకాలు సర్జరీ చేయించుకున్నారు.
తెరపైకి కోడలు రూపాదేవి
ప్రజలకు తాను అందుబాటులో లేకపోయినప్పటికీ తన తరఫున మురళీ మోహన్ తన కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకు వచ్చారు. ఆమె నియోజకవర్గంలో అన్నింటిని చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆమె రాజమహేంద్రవరంలోనే మకాం వేశారట. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం మమేకమవుతున్నారు.
మురళీ మోహన్ వారసురాలిగా
రూపాదేవి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీ కార్యకర్తల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారట. వాటిని తన మామయ్య మురళీ మోహన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. నియోజకవర్గంలో ఆమె దూకుడు చూస్తుంటే త్వరలో ఆమె మురళీ మోహన్ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా సాగుతోందట.
శ్రీలంకలో పని చేశారు
రూప రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడం, పార్టీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. త్వరలో ఆమె వారసురాలిగా రావొచ్చని అంటున్నారు. రూప శ్రీలంకలో పదమూడేళ్ల పాటు ప్రభుత్వ కన్సల్టెంట్గా పని చేశారు. అందరితో బాగా కలిసిపోతున్నారు.
కోడలును తీసుకు వస్తారా
ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేస్తారా అనే చర్చ ఇప్పటికే నియోజకవర్గంలో సాగుతోందట. మరోవైపు మురళీ మోహన్ కూడా ఇటీవల నియోజకవర్గంలో మరింత చురుగ్గా ఉంటున్నారు. దీంతో కోడలును తీసుకు వచ్చేందుకు ఆయన ముందుకు సాగుతున్నారా అనే చర్చ సాగుతోంది.