రెండేళ్ల ముందే స్టార్ 'వార్': చిరంజీవి నుంచి నాగార్జున దాకా!
ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి, వైసిపి, బిజెపి, జనసేనలు ఇప్పటి నుంచే పదును పెడుతున్నాయి.
అమరావతి: ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి, వైసిపి, బిజెపి, జనసేనలు ఇప్పటి నుంచే పదును పెడుతున్నాయి.
ఇదే సమయంలో ఎప్పటికప్పుడు కొన్ని ప్రచారాలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. దాసరి నారాయణ రావు, మోహన్ బాబు, చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. తాజాగా నాగార్జున ఇలా స్టార్ హీరోల చుట్టూ కూడా రాజకీయాలు తిరుగుతున్నాయి.
రాజకీయ సంచలనం: జగన్ పార్టీలోకి నాగార్జున అక్కినేని?
దీంతో వచ్చే ఎన్నికల్లో ఏఏ స్టార్ హీరోలు రంగంలోకి దిగుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఆయా పార్టీలకు వారే ప్రధాన ఆకర్షణ అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే చిరంజీవి పోటీ చేస్తారా? హిందుపురం నుంచి మరోసారి బాలయ్య పోటీ చేస్తారు.. మరి అనంతపురంలోని ఏ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఇప్పుడు నాగార్జున పేరు తెరపైకి వచ్చింది.
చిరంజీవి నుంచి నాగార్జున దాకా..
దాసరి వంటి వారు జగన్కు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే నిన్న చిరంజీవి నుంచి నేడు నాగార్జున వరకు.. వైసిపిలో చేరుతారనే ప్రచారం జరగడం ఆసక్తికర విషయం. నిజానిజాలు ఎంతో కానీ ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. వైయస్ కుటుంబంతో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందు నాగార్జున ప్రధాని మోడీని కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరవచ్చుననే ప్రచారం జరిగింది.
అందుకే జగన్ వైపు అంటూ..
వైయస్ రాజశేఖర రెడ్డితో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారని, వైసిపిలో చేరుతారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయా పార్టీల్లో స్టార్ 'వార్' సాగుతోంది. 2019లో టిడిపి తరఫున బాలకృష్ణ, వైసిపి తరఫున రోజా, కాంగ్రెస్ తరఫున చిరంజీవిలు ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. నాగార్జున వైసిపిలో చేరుతారనే ప్రచారం నిజమే అయితే.. అది జగన్కు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.
వైసిపిలోకి వీరు వస్తారని...
వైసిపిలోకి వీరు వస్తారని గతంలోను పలువురు నటుల పేర్లు వినిపించాయి. మోహన్ బాబు, జగన్ కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. వారి ఇరువురు కలుసుకున్న సమయంలో.. ఆయన వైసిపిలో చేరుతారనే ప్రచారం సాగింది. అందుకు తగ్గట్లు మోహన్ బాబు వ్యాఖ్యలు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు ఆయన డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల చిరంజీవి కూడా వైసిపిలో చేరుతారని సోషల్ మీడియాలో వట్టి ప్రచారం సాగింది. దాసరి నారాయణ రావు కూడా వైసిపిలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆయన మృతి చెందినప్పుడు కూడా వైసిపి నేతలు ఈ విషయం చెప్పడం వివాదానికి దారి తీసింది.
రాజకీయాల్లోకి నటులు
టిడిపిని స్థాపించిందే నటుడు ఎన్టీఆర్. అప్పటి నుంచి నటులు రాజకీయాల్లోను కనిపిస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా టాలీవుడ్ ప్రముఖ నటులు రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు హఠాత్తుగా జనసేనను స్థాపించారు. రాజశేఖర్, జీవితలు కాంగ్రెస్, వైసిపిలలో పని చేసి, ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. శివాజీ కూడా బిజెపిలో చేరారు. కానీ ప్రత్యేక హోదా ఉద్యమంతో ఆ పార్టీకి దూరమై, కమలంపై నిప్పులు చెరుగుతున్నారు. బాలకృష్ణ 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, హిందూపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. రోజా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు.