డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బు జమ: నంద్యాల ఎన్నిక రద్దవుతుందా?
ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ నాయకుడు భూమా బ్రహ్మానంద రెడ్డి సంబురం మూణ్ణాళ్ల ముచ్చటేనా? అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అమరావతి: ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ నాయకుడు భూమా బ్రహ్మానంద రెడ్డి సంబురం మూణ్ణాళ్ల ముచ్చటేనా? అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ప్రచార బరిలో నిలిపి 'నంద్యాల అసెంబ్లీ' స్థాన ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేసిన చాణక్య వ్యూహం ఫలించింది.
'నేనేసిన రోడ్లపై నడుస్తూ.. నా పథకాలను అనుభవిస్తూ నాకు ఓటేయరా?' అని ప్రశ్నించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికపై దేశవ్యాప్త ప్రచారం జరుగాలని ఆకాంక్షించారు. చివరాఖరికి నంద్యాలలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు.
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించడంలో తెర వెనుక బాగోతాలు క్రమ క్రమంగా బయటపడుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో జరిగిన అక్రమాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలతో అసలు సంగతి బయట పడింది.
చంద్రబాబు రాజకీయ చాణక్యం బయట పడింది. ఈ విజయానికి తమ పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ కారణమని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ అసలు సంగతేమిటో ఆ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ బయట పెట్టారు.
నంద్యాలలో డబ్బులు పంపిణీ నిజమే
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.4000 ఇచ్చిన మాట నిజమేనని టీడీపీ నేత గన్ని కృష్ణ అంగీకరించారు. కానీ దీన్ని ఎన్నికల తాయిలంగా చూడొద్దని పేర్కొన్నారు. ఈ సంగతిపై ఎవరైనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే కథ రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాట మాజీ సీఎం, పురుచ్చితలైవిగా పేరొందిన జయలలిత మరణించడంతో ఆమె స్థానానికి నిర్వహించ తలపెట్టిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ కోట్లు ఖర్చు పెట్టారన్న ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికనే రద్దు చేసింది.
రుణ మాఫీ కింద జమ చేశారని కొత్త వాదన
కానీ టీడీపీ నేత గన్ని కృష్ణ మాత్రం నంద్యాలలో డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.4,000 జమ చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అని అనడం సరి కాదని, ఎన్నికల కోణంలో చూడొద్దని చెప్పుకొచ్చారు. బుధవారం మీడియాతో గన్ని కృష్ణ చేసిన వ్యాఖ్యలను తక్కువ చేసి చూపేందుకు టీడీపీ అధికార మీడియాగా వ్యవహరించే దిన పత్రికలు ప్రయత్నించాయి. ఒక దిన పత్రిక ఆ వార్తాకథనమే ప్రచురించకపోగా, మరో దినపత్రిక జిల్లా ఎడిషన్లో చాలా సాధారణ వార్తగా ప్రచురించింది. అసలు సంగతి విస్మరించి వచ్చే ఎన్నికలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న శీర్షిక కింద ఇలా.. ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ కింద రూ.10 వేలు ఇస్తామని గతంలోనే ప్రకటించారని ఇందులో భాగంగా రెండు విడతలుగా రూ.3వేల చొప్పున అందజేశారన్నారు. మిగిలిన రూ.4 వేలు ఇవ్వడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు' అని గన్ని కృష్ణ చెప్పారని ఆ పత్రిక పేర్కొన్నది.
నంద్యాలలో మాత్రమే మహిళల ఖాతాల్లో రూ.4000 జమ
మూడున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నిజంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే ఆయన ప్రచారార్భాటం ముందు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం మూగబోయేదని, ప్రభుత్వ అనుకూల, ప్రభుత్వ మీడియాగా అనధికార ప్రచారం చేసుకునే సంస్థలు హోరెత్తించి ఉండేవని విశ్లేషకులు చెప్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు రాజకీయంగా ఏపీ సీఎం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నా.. ప్రొటోకాల్, అనుభవం, మర్యాద విషయంలో జగన్మోహన రెడ్డికి సలహాలిచ్చేందుకు కూడా వెనుకాడలేదు.
గతంలో వైఎస్ హయాంలో ఈనాడు గ్రూప్ చిట్ ఫండ్ సంస్థ ‘మార్గదర్శి' అక్రమాలపై ఫిర్యాదులతో హోరెత్తించిన సంగతి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలిసిన సంగతే. తాజాగా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ టీడీపీ ఎలా అడ్డదారులు తొక్కిందో సాక్ష్యాధారాలతో వివరించారు. ఎక్కడాలేని విధంగా కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళల ఖాతాల్లో చంద్రబాబు ప్రభుత్వం డబ్బు జమచేసిందని, ఉప ఎన్నికకు ముందు ఒక్కో ఖాతాలో రూ. 4 వేలు చొప్పున వేసిందని ఉండవల్లి వెల్లడించారు.
ఎన్నికల హామీ విస్మరణ.. తాయిలం ఇలా
జూలై 17 నుంచి ప్రారంభించి ఒక్కో గ్రూపునకు రూ. 48 వేలు చొప్పున నెల రోజుల్లో ముగించారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పాస్బుక్ల కాపీలను మీడియాకు చూపారు. ఉప ఎన్నికకు ముందు ఇలా చేయడం చాలా తీవ్రమైన అంశమని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా రూ. పదివేల రుణాన్ని రద్దు చేయలేదు కానీ, నంద్యాలలో మాత్రం ఉప ఎన్నికకు ముందే అక్కడి మహిళల ఖాతాల్లో రూ. 4 వేలు చొప్పున జమచేయడం దారుణమని ఉండవల్లి అన్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు.